Medipally Murder Case: గుండెపోటుతో భర్త మరణించాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన ఓ భార్య పాపం పండింది. పోలీసుల దర్యాప్తులో ఆమె ఆడిన “గుండెపోటు డ్రామా” బట్టబయలైంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కిరాతకంగా అంతమొందించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసు వివరాలను మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ ‘బిగ్ టీవీ’తో పంచుకున్నారు.
ఈ నెల 11వ తేదీన మేడిపల్లిలో అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన భర్త హార్ట్ ఎటాక్తో చనిపోయాడని అతడి భార్య పూర్ణిమ బంధువులకు, పోలీసులకు చెప్పింది. అయితే, మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. పోస్టుమార్టం నివేదికలో అశోక్ సహజ మరణం పొందలేదని, ఊపిరాడక (Asphyxiation), గొంతు నులిమి చంపినట్లు తేలడంతో పోలీసులు కేసును హత్యగా మార్చారు. మృతుడి భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి.
నిందితురాలు పూర్ణిమ స్థానికంగా ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. అదే కాలనీకి చెందిన మహేష్ తన సోదరి పిల్లలను ఆ స్కూల్లో చేర్పించేందుకు వచ్చి పూర్ణిమతో పరిచయం పెంచుకున్నాడు. గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం భర్త అశోక్కు తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో తన ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని పూర్ణిమ, ప్రియుడు మహేష్తో కలిసి పథకం రచించింది.
ఘటన జరిగిన రోజు అశోక్ ఇంటికి వచ్చే సమయానికే మహేష్, అతడి స్నేహితుడు సాయి ఇంట్లోనే మాటువేశారు. అశోక్ రాగానే అతనిపై దాడి చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి చున్నీతో అశోక్ గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. నేరం అంగీకరించడంతో నిందితులు పూర్ణిమ, మహేష్, సాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ శ్రీధర్ తెలిపారు.
Read Also: Vikarabad: సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కార్ కింద పడి చిన్నారి మృతి..