Kavitha vs KTR: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో న్యాయస్థానం నుండి క్లీన్ చీట్ పొందిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై, తన అన్న కేటీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుమారు ఐదున్నర నెలల పాటు జైలు జీవితం గడిపి తన పిల్లలకు, కుటుంబానికి దూరమైన సమయాన్ని ఎవరు తిరిగి ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ కేసు కేవలం తన తండ్రి కేసీఆర్ గారిని.. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని మొదటి నుండి చెబుతున్నానని.. నేడు న్యాయం గెలిచిందని అన్నారు. అబద్ధపు ప్రచారాలను చేదించుకుంటూ నిజం బయటకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. జైలులో ఉన్న సమయంలో తాను పడిన వేదనను.. సోషల్ మీడియాలో తనపై జరిగిన అసభ్యకరమైన ప్రచారాన్ని ఎవరూ ఊహించలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి తనపై ఉన్న కేసులే కారణమని కేటీఆర్ చేసిన ట్వీట్పై కవిత ఘాటుగా స్పందించారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదని.. వాస్తవాలను అంగీకరించే ధైర్యం ఉండాలని అన్నకు సూచించారు. తాను జైలుకు వెళ్లినప్పుడు కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని వారు.. ఇప్పుడు ఓటమికి తనను బాధ్యురాలిని చేయడం విడ్డూరమని మండిపడ్డారు. పార్టీ కోసం తాను జైలుకు వెళ్లిన విషయం కేసీఆర్ గారికి తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కనీసం తనకు మద్దతుగా నిలవకపోగా.. తనను హేళన చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇళ్లు ఇవ్వకపోవడం.. ఉద్యోగాల కల్పనలో వైఫల్యం.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ టికెట్లు ఇవ్వడం వంటివి ఓటమికి దారితీశాయని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ నాయకుల్లో పెరిగిన అహంకారమే ప్రజలను దూరం చేసిందని స్పష్టం చేశారు. కేవలం తన కేసు వల్లే పార్టీ ఓడిపోయిందనే భ్రమలో బ్రతకవద్దని.. వాస్తవ ప్రపంచంలోకి రావాలని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సంబరాలకు పరిమితం కాకుండా రైతుల సమస్యలపై విచారించేందుకే రైతు కమిషన్కు వచ్చానని తెలిపారు.
తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదన్నారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు కవిత ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్న కవిత.. ఈ కేసులు తనను ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలల్లో తన సొంత పార్టీ విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు. తనకు పెయిడ్ సోషల్ మీడియా ఆర్మీ లేదని.. తన వెన్నంటి ఉన్న ప్రజలతోనే కొత్త రాజకీయ చరిత్ర సృష్టిస్తానని స్పష్టం చేశారు. ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు కించపరిచిన వారందరికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.
Read Also: Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!