బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఫైర్ అయ్యారు. సిట్ విచారణకు పిలిచిన సమయంలో చట్టాన్ని గౌరవించి వెళ్లాలి గానీ ఎదురు ప్రశ్నించడం సరికాదని ఆమె విమర్శల బాణాలు ఎక్కుబెట్టారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును టార్గెట్ చేసిన కవిత.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల వల్లే ఇప్పుడు పార్టీకి ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యారని అన్నారు. అన్యాయంగా కొందరి జీవితాల్లోకి చొరబడి వారి మాటలు వినడం క్షమించరాని నేరం అన్నారు. సిట్ విచారణకు తనను పిలిస్తే తప్పకుండా వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇక పార్టీకి మరల జవసత్వాలు రావాలంటే ఏం చేయాలో కూడా కవిత వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా పిలువబడుతున్న గులాబీ పార్టీలో మాజీ సీఎం ప్రస్తుతం వయసు రీత్యా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావులు మోస్తున్నారు. వీరిద్దరూ కలిసి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, తన సోదరుడు వ్యవహరిస్తున్న తీరుపై కల్వకుంట్ల కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిట్ విచారణకు నోటీసులు ఇవ్వడం వారి డ్యూటీ అని.. ఎలా ఇస్తారని ప్రశ్నించడం ప్రజాస్వామ్య దేశంలో సరికాదన్నారు. కేటీఆర్ ఇంకా నియంతృత్వ, రాచరికపు పోకడలను మానుకోవాలని హితవు పలికారు.
ఇలాగే ముందు కూడా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ కష్టమేనని ఆమె తేల్చిచెప్పారు. ఇక మున్సిపల్ ఎన్నికల కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసును అటు, ఇటు తిప్పుతున్నారని, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా ఎందుకు కేసు ముందుకు పడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినందుకే విచారణకు పిలిచారని అన్నారు. చట్టాలకు ఎవరూ అతీతం కాదని స్పష్టం చేశారు. తనను విచారణకు పిలిచినా వెళ్తానని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ని చూసి ఓటు వేయాలని కేటీఆర్ అంటున్నారని.. ఇది కూడా వారి నియంతృత్వ పోకడలకు నిదర్శనమని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఎవరున్నా ఓటు వేయాలని కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కవిత.. ఓటర్లు మంచొళ్లు, కష్టపడే తత్వం ఉన్నవారు, అభివృద్ధిపై ఎవరికి ఆలోచన ఉంటుందో అలాంటి వారికే ఓటు వేసి గెలిపించాలని కవిత ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఫేస్ చూసి ఇంకెంత కాలం ఓట్లు వేస్తారని పరోక్షంగా ఆమె ప్రశ్నించారు. కాగా, కవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో చాలా మంది విమర్శలు చేస్తారని.. కొన్నింటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు ఫార్వార్డ్ బ్లాక్ నుంచి తమ నేతలు బరిలోకి దిగుతారని కవిత ప్రకటించారు. ఈ ప్రకారం కవిత వలన బీఆర్ఎస్ ఓట్లు సైతం చీలే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే సర్పంచ్ ఎన్నికల్లో కంటే బీఆర్ఎస్ స్థానాలు మరింత తగ్గే అవకాశం లేకపోలేదు.