Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను సీఎం అవుతానని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కవిత లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే అయితే.. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె నోటీసులోని పలు అంశాలను కూడా ప్రస్తావించారు. కొందరు తనపై, తన భర్త అనిల్పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆరోపించారు. నాకు కూడా టైం వస్తుంది.. నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతా.. నేను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తా అని కవిత హాట్ కామెంట్స్ చేశారు . తమపై ఆరోపణలు చేసిన వారు వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతే కాకుండా తాను గాంధీని కాదని, కేసీఆర్కు ఉన్నంత ఓపిక తనకు లేదని అన్నారు. తనను టార్గెట్ చేస్తే ఊరుకోనని తెలిపారు. అందరూ ఒకే స్ట్రాటజీతో తనపై విమర్శలు చేస్తున్నారని .. కానీ ఇక నుంచి తనపై ఆరోపణలు చేసిన వారిని క్షమించనని అన్నారు. 2014 నుంచి జరిగిన అన్యాయాలపై త్వరలోనే స్పందిస్తానని వ్యాఖ్యానించారు. తాను నిజంగానే తప్పు చేస్తే ప్రజలను క్షమాపణ అడుగుతానని, అందుకు ఏమాత్రం సందేహించనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరికి అక్రమంగా భూములను రాసిచ్చిందని , సమయాన్ని బట్టి ఆధారాలతో సహా అన్నీ బయటపెడతానని హెచ్చరించారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు సరెండర్
ఇదిలా ఉంటే.. తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. మొదటగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న(గురువారం) నగరంలోని మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు.