KCR : హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మెట్రో రెండో దశ శంకుస్థాపన సందర్భంగా అప్పా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేంద్ర సహకారం లేకపోయినా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరమని కేసీఆర్ స్పష్టం చేశారు. న్యూయార్క్, ప్యారీస్, లండన్లో కరెంట్ పోవచ్చు.. కానీ హైదరాబాద్లో మాత్రం పవర్ పోయే అవకాశం లేదన్నారు. 1912 నుంచే నగరానికి విద్యుత్ సౌకర్యం ఉందన్నారు. హైదరాబాద్ నిజమైన విశ్వనగరమన్నారు. ఒకప్పుడు తాగు నీటి సమస్య ఉండేదని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేశామన్నారు. అన్ని కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. అందరికీ అనువైన వాతావరణ నగరంలో ఉందన్నారు. భాగ్యనగరం అన్నివర్గాలను అక్కున చేర్చుకుందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో హైదరాబాద్ పెద్దదని కేసీఆర్ అన్నారు. నగరంలో మెట్రో.. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు పోతున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని కేసీఆర్ చెప్పారు.
చరిత్రలోనే కాదు.. వర్తమానంలోనూ హైదరాబాద్ చాలా గొప్పదన్నారు కేసీఆర్. దేశంలో ఏ నగరంలోనూ లేని అద్భుతమైన సమశీతోష్ణ వాతావరణం ఇక్కడ ఉందని తెలిపారు. భూకంపాలు రాకుండా భూగోళంపై సురక్షితంగా ఉండే సిటీ హైదరాబాద్ అన్నారు. ఐటీ రంగంలో 500 పరిశ్రమలు కొలువుదీరుతున్నాయని వెల్లడించారు. ఎస్ఆర్డీపీ కింద పనులు చేపట్టి ట్రాఫిక్ కష్టాలు తీర్చుతున్నామని వివరించారు. హైదరాబాద్ను ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.