Metro : హైదరాబాద్ లో మెట్రో రెండో దశకు తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మైండ్స్పేస్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పునాదిరాయి వేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోను నిర్మిస్తారు. మైండ్స్పేస్ కూడలి నుంచి 0.9 కి.మీ. దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్పోర్ట్ స్టేషన్తో విమానాశ్రయ మెట్రో ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లైఓవర్లను దాటుకుని నేరుగా కాజాగూడ చెరువు పక్క నుంచి ఎలైన్మెంట్ వెళ్తుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్ఆర్ పక్క నుంచి నార్సింగ్, అప్పా జంక్షన్, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ కు నేరుగా చేరుకునేలా ఎలైన్మెంట్ రూపొందించారు.
ఇప్పుడున్న మెట్రో కంటే మరిన్ని ఆధునిక సౌకర్యాలను కొత్త మెట్రో లో కల్పిస్తారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా సీట్లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్ల తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి. రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్ల ఉపయోగిస్తారు. కారిడార్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మిస్తారు. ప్రయాణికుల కోసం స్కైవాక్లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తారు.
కొత్త మెట్రో లైన్ లో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 9 స్టేషన్లు ఉంటాయి. మొత్తం 31 కి.మీ. దూరం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.6,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ సమయంలో ప్రతీ 5 నిమిషాలకు ఒక మెట్రో రైల్ నడుస్తుంది. గంటకు 120 కి.మీ. వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. 31 కిలోమీటర్ల దూరం 26 నిమిషాల్లో చేరేలా ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా విమానంలోకి వెళ్లేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. లగేజీ స్క్రీనింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.