Mahabubabad News: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం వార్డుల్లో ఎన్నికల అధికారులు రూపొందించిన ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తుల పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని, అర్హులైన వారు కాకుండా మరణించిన వారు ఓటర్లుగా ఉండటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వారు వాదించారు. ఈ వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అభ్యర్థులు నేరుగా స్థానిక స్మశాన వాటికకు వెళ్లి, అక్కడ ఉన్న సమాధుల వద్ద నిలబడి ఓట్లు వేయమని వేడుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. “ఓ అవ్వా… ఓ తాతా… నేను ఒకటో వార్డుకు అభ్యర్థిగా, 14వ నెంబర్ గుర్తు మీద మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డాను. మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే… మీరు చచ్చిపోయి ఇప్పటికి ఆరు, ఏడు సంవత్సరాలు అవుతోంది. కానీ ఈ అధికారులు చూడండి… ఇప్పటికీ మీ పేరును ఓటర్ల జాబితాలోనే ఉంచారు.” అని అన్నారు.
ఓటర్ల జాబితా నుండి మృతుల పేర్లను తొలగించడంలో ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని వారు ఎండగట్టారు. ఓటర్ల జాబితాలో ఉన్న మృతుల పేర్లను, వారి సమాధులను చూపిస్తూ అధికారులకు కనువిప్పు కలిగేలా ఈ నిరసన చేపట్టారు. వెంటనే ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని, మరణించిన వారి పేర్లను తొలగించి పారదర్శకమైన జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్మశానంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మున్సిపల్ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండటంతో, అభ్యర్థులు నేరుగా స్మశాన వాటికకు వెళ్లి సమాధులను ఓట్లు అడుగుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. తప్పుల తడకగా జాబితాను… pic.twitter.com/3mkVp3MfQj
— ChotaNews App (@ChotaNewsApp) February 9, 2026
Read Also: Harish Rao: రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే.. నేనే మంత్రిని.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్