Asifabad District News: మానవుని ఎముకలతో పూజలు చేస్తే చాలు.. కావాల్సినంత బంగారం వస్తుందన్నది వారి నమ్మకం. అంతేకాదు ఆ ఎముకతో పూజలు నిర్వహిస్తే చాలు, గుప్తనిధులు రయ్.. రయ్ అంటూ పైకి వస్తాయని వారి విశ్వాసం. అయితే మనిషి ఎముక ఎలా అనే ప్రశ్న వారి మదిలో మెదిలింది. ఇక అంతే తాజాగా మృతి చెందిన జాబితా తెలుసుకున్నారు. ఏకంగా ఒక సమాధిని త్రవ్వారు. అందులో నుండి ఎముక కూడ తీసుకున్నారు. బంగారం ఏమో కానీ, చివరికి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో జరిగింది.
బెజ్జూరు మండలంలోని హేటిగూడ గ్రామంలో 14 రోజుల క్రితం చిన్నయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అయితే చిన్నయ్య కుటుంబీకులు బుధవారం తెల్లవారుజామున సమాధి వద్దకు వెళ్లి చూడగా, ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు వారు గుర్తించారు. దీంతో గ్రామంలో కొత్తగా వ్యక్తులు తిరుగుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు.
చిన్నయ్య సమాధిని త్రవ్వి, ఎముకలు తీసుకెళ్లినట్లు గుర్తించిన వారు, అనుమానస్పద వ్యక్తిగా రావోజీని భావించారు. రావోజీ వద్దకు కొత్త వ్యక్తులు వస్తున్నట్లు తెలుసుకొని నిలదీయడంతో, చిన్నయ్య కుటుంబ సభ్యులపై వారు దాడికి పాల్పడినట్లు సీఐ రమేష్ తెలిపారు. ఈ దాడితో మరింత అనుమానం పెరిగి స్థానిక పోలీస్ స్టేషన్ లో చిన్నయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీఐ ముత్యం రమేష్, స్థానిక పోలీసులతో అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మనిషి ఎముకతో పూజలు నిర్వహిస్తే బంగారం ఇంట్లోకి వస్తుందని నమ్మకంతో ఇలా చేసినట్లు నిందితులు అంగీకరించారు.
Also Read: Lady Aghori: మళ్లీ అఘోరీ హల్చల్.. పెట్రోల్ క్యాన్ తో బెదిరింపులు..
ఈ కేసు గురించి సీఐ మాట్లాడుతూ… మొత్తం 5 మంది వ్యక్తులు చిన్నయ్య సమాధిని తవ్వి ఎముకలను తీసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. గుప్తనిధుల కోసమే సమాధిని తగ్గినట్లు వీరు అంగీకరించారని, అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గ్రామాలలో సంచరిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.