Komatireddy Venkat Reddy: తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే విద్యావ్యవస్థను మొత్తం మార్చేస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తానన్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల దోపిడీ ఎక్కువైందని, విద్యను అమ్ముకుంటున్నారన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
“అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలి. టీచర్లు కూడా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కువ ఉన్నారు. నారాయణ కాలేజీ, ప్రభుత్వ కాలేజీ పొండి.. అక్కడ డిగ్రీ చేసిన వాళ్లుంటారు. ఇక్కడ పీహెచ్డీ చేసి.. గ్రూప్ నకు ప్రిపేర్ అయిన వాళ్లుంటారు. ఏదైనా ఉద్యోగం రాక లెక్చరర్ అయిన వాళ్లుంటారు. కానీ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వెంట పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీల బట్టి వల్ల వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నాకెప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వస్తే ఈ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయించడం ఖాయం” – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
“అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయమైతది. ఎవరైన అడ్మిషన్ కావాలని నా దగ్గరకు వస్తే.. నారాయణ, శ్రీ చైతన్య కు కాల్ చేస్తే అడ్మిషన్ ఫీజు రూ.3 లక్షలు అంటారు. మీకు కాబట్టి రూ.2 లక్షలు చేస్తామంటారు. అసలు ఫీజు రూ.2 లక్షలు, కోమటిరెడ్డి ఫోన్ చేస్తారని ముందే తెలుసుకుని చెప్పడం రూ.3 లక్షలు చెబుతారు. ఎంత దొంగలంటే వాళ్లు. నాకు కోపం వస్తుంది ఇలాంటి చూస్తుంటే. విద్య వ్యాపారం కాదు. 25 శాతం సీట్లు పేదవాళ్లకు ఇవ్వాలని చట్టం ఉంది. కానీ ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు” – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి