Yograj Singh praises Imran Khan: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఒకప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో చిప్పకూడు తింటున్న ఇమ్రాన్ ఖాన్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. అతడికి సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ( Yograj Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటి దిగ్గజ క్రికెటర్ ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఉండడం చాలా దౌర్భాగ్యం అన్నారు. ఇండియాలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పుట్టింటే, నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్లం అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అతడిని ఒక రాజు లాగా చూసే వాళ్ళమని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల, శ్రద్ధ వహించి మెరుగైన వైద్యం అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యోగ్రాజ్ సింగ్.
జైలులో చిప్పకూడు తింటున్న ఇమ్రాన్ ఖాన్ గురించి యోగ్రాజ్ సింగ్ ( Yograj Singh) ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అతనికి అత్యవసర చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలలో తయారుచేసిన ఏకైక స్టార్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ అని… అతడినే ఇప్పుడు దారుణంగా జైల్లో పెట్టి అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి ఇమ్రాన్ ఖాన్ ఇండియాలో ఉంటే… నెత్తిన పెట్టుకొని ఒక కింగ్ లాగా చూసుకునే వాళ్ళమని వివరించారు. కానీ పాకిస్తాన్ మాత్రం జైల్లో వేసి హింసిస్తోందని ఫైర్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంగా ఉన్న నేపద్యంలో అతని కుటుంబ సభ్యులకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు ఇమ్రాన్ ఖాన్ ను ఆయన కుటుంబ సభ్యులు కలిసేలా ప్రత్యేక అనుమతులు ఇచ్చి… గొప్ప మనసు చాటుకోవాలని పాకిస్తాన్ (PAk) ప్రభుత్వానికి సూచనలు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన యోగ్రాజ్ సింగ్… అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిసిసిఐ అలాగే ఇండియన్ గవర్నమెంట్ అనుమతి ఇస్తే… తాను పాకిస్తాన్ వెళ్తానని ప్రకటించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తానని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పటినుంచి పని మొదలుపెడితే సంవత్సరం కాలంలో పాకిస్తాన్ జట్టును నెంబర్ వన్ గా నిలిపి ఛాన్స్ ఉంటుందని తెలిపారు యోగ్రాజ్ సింగ్.