Formula E Race: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండీఏ మాజీ అధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం వారిని ఆదేశించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2023లో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. హెచ్ఎండీఏ ఖాతా నుంచి సుమారు 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ తన దర్యాప్తులో గుర్తించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ భారీ మొత్తాన్ని విదేశీ సంస్థకు చెల్లించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఏసీబీ పేర్కొంది.
ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కేటీఆర్ను ఏ1గా చేర్చగా, అరవింద్ కుమార్ను ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. వీరితో పాటు స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు, ఎఫ్ఈఓ సంస్థను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులను ఏసీబీ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. తాజాగా హైకోర్టు కూడా ఈ కేసును విచారణకు స్వీకరించడం, ఏసీబీ కోర్టు సమన్లు ఇవ్వడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: కేంద్రం తీరుపై రాఘవులు నిప్పులు.. శ్రీలంక గతే భారత్కు పడుతుందా?
BREAKING
కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు
ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ
కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, BLN రెడ్డికి సమన్లు
ఏసీబీ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు pic.twitter.com/kTwXuX0iOW
— BIG TV Breaking News (@bigtvtelugu) May 14, 2026