KTR: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బొగ్గు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు.
సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కింగ్ పిన్ అని, ఆయనకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు.బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం నైనీ బ్లాక్ మాత్రమే కాకుండా, సృజన్ రెడ్డి దక్కించుకున్న అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బొగ్గు కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే రాత్రికి రాత్రే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. ఇది సిట్ విచారణ కాదని, రేవంత్ రెడ్డి పంపిస్తున్న ‘చిట్టి’ విచారణ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసులో పస లేదని కొట్టివేసినా, మళ్లీ విచారణ అనడం కేవలం రాజకీయ వేధింపులేనని మండిపడ్డారు. ఈ రాజకీయ క్రీడలో భాగస్వాములవుతున్న అధికారులను వదిలిపెట్టబోమని, రిటైర్ అయిన వారిని కూడా చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
కేబినెట్ మొత్తం ‘దండుపాళ్యం బ్యాచ్’లా తయారైందని, దందాల నుండి దృష్టి మళ్లించడానికే ఇలాంటి విచారణలు చేపడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూ అరాచకాలపై లేదా ఏఐసీసీ సెక్రటరీ డిమాండ్ చేసిన నిధులపై సిట్ విచారణ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదని, రేపు అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: రుణమాఫీ.. న్యాయం కావాలంటూ కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా రైతులు