KTR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రకంపనలు ఇంకా ఆగడంలేదు. ఈ ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడగొట్టి అసెంబ్లీకి రాకుండా చేసే బాధ్యత తనదంటూ సవాల్ చేశారు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్ పెడితే సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందంటూ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ అల్విన్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ ఇవాళ బీఆర్ఎస్ లోకి చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్..అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కేం బాధ అని ప్రశ్నించారు. తాను హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాష నేర్చుకున్నానని, రేవంత్ కూడా నేర్చుకోవచ్చని అన్నారు. తాను గుంటూరులో ఇంటర్ చదువుకుంటే తప్పంట.. రేవంత్ అల్లుడు ఆంధ్రోడే కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇక.. భీమవరం బుల్లోడు అంటూ విమర్శించారు.
‘మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు. బరాబర్ చెప్తా!’ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గత రెండేళ్లుగా కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని సెటైర్లు వేశారు. రేవంత్ లెక్క సంచులు మోసుకుంటే ఆయన పిల్లలు చెప్పుకోరని విమర్శించారు. రేవంత్ భాషను పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ను వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారన్నారు. 10 శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ ప్రశ్నించారని.. అందులో తప్పేముందన్నారు.
“కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై నాకు గొంతు వరకు కోపం ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. ఏం చేయలేం. నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదట. ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదాం”- కేటీఆర్
Also Read: Phone Tapping Case: ఆరా మస్తాన్ స్టేట్మెంట్లు కీలకం.. రెండోసారి విచారిస్తున్న సిట్
ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నికల హామీల్లో కల్యాణ లక్ష్మీ కింద ఆడ బిడ్డల పెళ్లికి లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే మహిళలకు రూ.2500 ఇస్తానని ప్రియాంక గాంధీ మీద ఒట్టు వేశారని గుర్తుచేశారు. ఇవన్నీ ఎగవేసి, ఇప్పుడు కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తానంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు.