Jangaon district: జనగామ జిల్లా తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న ఈ భారీ దోపిడీ వ్యవహారం రెవెన్యూ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. యాదాద్రి జిల్లాకు చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ప్రధాన సూత్రధారిగా ఉంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపులో ఫోర్జరీకి పాల్పడుతూ, నకిలీ రశీదుల ద్వారా సామాన్యుల సొమ్మును దారి మళ్లిస్తున్నాడు.. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
అయితే ఈ ముఠా పనితీరు అత్యంత పకడ్బందీగా సాగుతోంది. వినియోగదారులు చెల్లించాల్సిన అసలు మొత్తానికి సంబంధించిన చలాన్లను థర్డ్ పార్టీ ఎడిటింగ్ అప్లికేషన్ల ద్వారా మార్పులు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి 9,000 రూపాయలు చెల్లిస్తే, అందులో ఒక సున్నాను తొలగించి కేవలం 900 రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. ఇలా కేవలం ఒక్క రోజులోనే 10 చలాన్ల ద్వారా సుమారు 8.55 లక్షల రూపాయలను కొల్లగొట్టారంటే, గత కొన్నేళ్లుగా జరిగిన దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ కుంభకోణం వెనుక సీసీఎల్ఏ (CCLA) టెక్నికల్ టీమ్ లేదా ఉన్నత స్థాయి ఐటీ సిబ్బంది హస్తం ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, తక్కువ మొత్తానికి తీసిన చలాన్ నంబర్ను స్లాట్ బుకింగ్ సమయంలో అప్లోడ్ చేసినప్పుడు, పోర్టల్ దానిని రిజెక్ట్ చేయకుండా ఆమోదించడం సాంకేతిక లోపమా లేక కుమ్మక్కా అనే కోణంలో విచారణ సాగుతోంది. సాఫ్ట్వేర్ సెక్యూరిటీని బైపాస్ చేసి, ఫేక్ చలాన్లతో స్లాట్ కన్ఫర్మ్ కావడం వెనుక అంతర్గత సహకారం లేకుండా సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు.
అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే ఈ తరహా దందా కొనసాగుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం తెచ్చిన డిజిటల్ విధానాన్నే కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన అన్ని రిజిస్ట్రేషన్ల చలాన్లను క్షేత్రస్థాయిలో రీ-వెరిఫికేషన్ చేస్తే, ఈ స్కామ్ విలువ కోట్ల రూపాయల్లో ఉండే అవకాశం ఉందని రెవెన్యూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెలంగాణపై కొత్త పలుకులు..
ప్రస్తుతం జనగామ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలను, ఇంటర్నెట్ సెంటర్లలోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో కేవలం ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులే కాకుండా, వారికి సహకరించిన ప్రభుత్వ సిబ్బంది ఎవరనేది తేలాల్సి ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు జరిగిన భూముల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు భూ యజమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.