Liquor Ban: యువతను వ్యసనాల బారి నుంచి కాపాడి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామస్తులు ఏకగ్రీవంగా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బెల్ట్ షాపుల సంస్కృతి వల్ల యువత పెడదారి పడుతుండటాన్ని గమనించిన గ్రామ పెద్దలు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు.
సుమారు 1300 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఇటీవల సర్పంచ్గా ఎన్నికైన ముష్కే రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఈ మేరకు తీర్మానం చేశారు. మద్యం మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, గొడవలతో ఊరి వాతావరణం దెబ్బతింటోందని మహిళా సంఘాలు మరియు కుల సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిషేధాన్ని ఏదో మాటవరసకు కాకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ కమిటీ కఠినమైన నిబంధనలను రూపొందించింది. గ్రామంలో ఎవరైనా రహస్యంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడితే వారికి రూ. 10,000 భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే, మద్యం అమ్మేవారి గురించి లేదా తాగేవారి గురించి సమాచారం అందించిన వారికి రూ. 2,000 నగదు బహుమతి (Reward) అందజేస్తామని ప్రకటించారు.
ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు కచ్చితంగా అమలులోకి వస్తాయని గ్రామసభలో ప్రకటించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం, ఊరి బాగు కోసం లక్ష్మాజీపల్లి గ్రామస్తులు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పొరుగు గ్రామాల ప్రజలు సైతం వీరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.
Read Also: ఇది కదా కావాల్సింది.. అక్రమ కబ్జాలపై హైడ్రా మెరుపు దాడి.