Hyderabad News: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైడ్రా (HYDRA) తన లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతోంది. ప్రజా ఆస్తుల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్లో అక్రమ కబ్జాలపై హైడ్రా చేపడుతున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రెండు విలువైన పార్కు స్థలాలను అక్రమ కబ్జాదారుల నుంచి హైడ్రా రక్షించింది.
కూకట్పల్లి భాగ్యనగర్ ఫేజ్–3 కాలనీలో ఉన్న రెండు పార్కులు కబ్జాకు గురయ్యాయని అక్కడి నివాసితుల సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
పరిశీలనలో భాగంగా 3 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు పార్కులలో భారీగా ఆక్రమణలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక పార్కు 2 వేల గజాల విస్తీర్ణంలో ఉండగా.. అందులో సగం వరకు అక్రమంగా ఆక్రమించబడినట్లు తేలింది. అలాగే ఎకరం విస్తీర్ణంలో ఉన్న మరో పార్కులో సుమారు వెయ్యి గజాల మేర కబ్జా జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ రెండు పార్కుల మొత్తం విలువ సుమారు 35 కోట్ల రూపాయలుగా అధికారులు అంచనా వేశారు.
నివేదిక ఆధారంగా వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. పార్కు స్థలాలను పూర్తిగా స్వాధీనం చేసుకుని.. భవిష్యత్లో మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ‘ఇది ప్రభుత్వ ఆస్తి – ఆక్రమణ నేరం’ అనే హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
ప్రజా ఆస్తులను కాపాడిన హైడ్రా చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇలాంటి చర్యలు కొనసాగించాలని కోరారు. ప్రజల సహకారంతో అక్రమ కబ్జాలపై పోరాటం కొనసాగుతుందని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: Fire Accident: SVS కెమికల్స్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు