Assembly Attendance: స్వేచ్ఛ బ్యూరో: సభలోని సభ్యుల్లో నోసీరియస్ నెస్ రాష్ట్రంలో 119 మంది అసెంబ్లీలో సభ్యులు ఉన్నప్పటికీ సభలో మాత్రం 30 మంది సైతం సరిగ్గా కూర్చోవడం లేదు. కేవలం అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడేవరే కరువయ్యారనే ప్రచారం జరుగుతుంది. వారివారి నియోజకవర్గాల్లోని సమస్యలపై సైతం సరిగ్గా గళం ఎత్తడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సభ్యులంతా సభకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. సభ్యుల్లో సీరియస్ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది.
బడ్జెట్ పై గత రెండు రోజులుగా చర్చజరిగింది. ఆ బడ్జెట్ తోపాటు ప్రశ్నోత్తరాల సమయంను సైతం శాసనసభలో నిర్వహించారు. కానీ సభ్యులు ఎక్కువమంది సభకు రావడం లేదని, వారివారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై మాట్లాడటం లేదనే ప్రచారం జరుగుతుంది. కేవలం కొంతమంది మాత్రమే వస్తున్నారని, వారు సైతం ఎక్కువ సేపు వారికి కేటాయించిన సీట్లలో కూర్చొవడం లేదని సభను చూస్తేనే స్పష్టమవుతోంది. అలాంటప్పుడు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను ఎలా సభ దృష్టికి తీసుకొస్తారని, ఎలా పరిష్కరిస్తారనే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు సభలో మాట్లాడకుండా కేవలం ఇలా వచ్చి అలా వెళ్లడం కొంతమంది హాజరువేసుకొని వెళ్తుండటం మరికొందరు అసలు సభకు ఒకరోజూ వచ్చి మరో రోజుకు రాకపోవడంపై వారికి ఏమేరకు సభపై సీరియస్ నెస్ ఉందో అర్థమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సభ జరిగే సమయంలో సభలో కూర్చోకుండా తిరుగుతుండటం, సభ్యులు ఏ అంశంపై ఏం మాట్లాడుతున్నారో.. తెలుసుకోకుండా..కొందరు సభ్యులు పలు సందర్భాల్లో కౌంటర్లు ఇస్తుండటం గమనార్హం. పూర్తిగా అంశంపై పట్టులేకుండానే మాట్లాడుతుండటంతో మరోపార్టీ సభ్యులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దీంతో సభ లైవ్ చూసిన వారికి సభ్యుల తీరు స్పష్టమవుతోంది.
బడ్జెట్ పై రెండోరోజూ మంగళవారం చర్చజరిగింది. అయితే మధ్యాహ్నం 3.35 గంటల ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు 18 మంది, బీఆర్ఎస్ సభ్యులు 8మంది, సీపీఐకి చెందిన సభ్యుడు మాత్రమే సభలో ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం సభ్యులు సభలో లేరు. మంత్రులు సైతం ముగురునాలుగురు మాత్రమే ఉన్నారు. పార్టీకి సమావేశాల్లో సభ్యులు విధిగా హాజరుకావాలని సీఎం ఆదేశాలు సైతం ఇచ్చారు. అయినప్పటికీ సభ్యులు మాత్రం నామమాత్రంగా హాజరు అవుతుండటం ఇప్పుడు చర్చకుదారితీసింది. 119మంది సభ్యులు ఉన్నప్పటికీ మాత్రం సభలో పూర్తి స్థాయి కోరం ఉండకపోవడం, కేవలం 30 నుంచి 40మంది సభ్యులు మాత్రమే హాజరవుతుండటం విమర్శలకు కారణమైంది. సభ్యులు సభలో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి తీసుకున్న వారు మాత్రమే హాజరవుతుండటం, మాట్లాడిన తర్వాత వారు సైతం సభలో ఉండకుండా వెళ్తుండటం, మళ్లీ వస్తుండటం.. ఇలా సభ కొనసాగుతున్న తీరు విమర్శలకు దారితీసింది. సభ ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సి ఉంది. వారికి సందేశం ఇవ్వాల్సి ఉంది. సభలో జరుగుతున్న తీరును ప్రజలను అనుసరిస్తారు. ప్రతి అంశం ప్రజలకు చేరాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా సభ్యులు సభకు హాజరవుతుండటం, పూర్తిస్థాయిలో సభ్యులు రాకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
అన్నిపార్టీల్లోని ఎమ్మెల్యేల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రజాసమస్యలు, నియోజకవర్గంలో ఎదురవుతున్న అంశాలను సభా వేదికగా ప్రస్తావించకుండా కేవలం ఇలా వచ్చి అలా వెళ్తుండటం, మొక్కుబడిగా రావడంతో వారి తీరుపై చర్చజరుగుతుంది. ప్రజాప్రతినిధిగా ఉన్నవారు ఇలా వ్యవహరిస్తుండటం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికైనా సభలో సభ్యులు ప్రజలకు మార్గదర్శిగా ఉంటారా? సమస్యలపై చర్చిస్తారా? బుధవారం నుంచి జరిగే పద్దులపైనైనా చర్చలో పాల్గొంటారా? లేదా? అనేది ఇప్పడు చర్చనీయాంశమైంది.
Also Read: Mac Mini: ఫోన్ కన్నా తక్కువ ధరలో యాపిల్ కంప్యూటర్.. ఇది అస్సలు మిస్ అవ్వకండి..