Maganti Family Dispute: దివంగత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం తీవ్రరూపం దాల్చింది. తన తండ్రి మరణం వెనుక, తనను చట్టబద్ధమైన వారసుడిగా గుర్తించకపోవడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపిస్తూ ఆయన మొదటి భార్య మాలిని కుమారుడు తారక్ ప్రతిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో తల్లి మాలినితో కలిసి మీడియా ముందుకు వచ్చిన తారక్, తన తండ్రి రెండవ భార్య సునీత మాగంటిపై, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నేను వారసుడిని కాదా? ఇదిగో ఆధారాలు..
లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో తన పేరును చేర్చకపోవడాన్ని తారక్ తీవ్రంగా ఖండించారు. తన గుర్తింపును ప్రశ్నిస్తున్న వారికి సమాధానంగా ఆయన తన ప్రభుత్వ గుర్తింపు పత్రాలను మీడియాకు చూపించారు. “వాళ్ళు నన్ను ఎవరో కొసరాజు అని, చెన్నైలో, యూఎస్లో ఉంటాడని అంటున్నారు. కానీ నా బర్త్ సర్టిఫికెట్, నా పాస్పోర్ట్, నా ఆధార్ కార్డు… అన్నింటిలో నా తండ్రి పేరు ‘మాగంటి గోపీనాథ్’ అనే స్పష్టంగా ఉంది. ఇవన్నీ ప్రభుత్వ ఐడీలే..” అని తారక్ ఆధారాలను బయటపెట్టారు. తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, దానికి సంబంధించిన కోర్టు పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. “మా నాన్నగారు విడాకుల కోసం అప్లై చేసి ఆయనే హాజరుకాలేదు. దాంతో కోర్టు ఆ పిటిషన్ను ‘డిస్మిస్డ్ బై డిఫాల్ట్’గా కొట్టివేసింది. ఆ డిక్రీ కాపీ మా వద్ద ఉంది, అంటే చట్ట ప్రకారం వారు ఇంకా భార్యాభర్తలే.” అని తారక్ కీలకమైన న్యాయపరమైన అంశాన్ని లేవనెత్తారు.
తనను ఎవరో తెలియదని అంటున్న సునీత మాగంటి, తన తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పటి నుండి తనతో నిరంతరం టచ్లో ఉన్నారని తారక్ ఆరోపించారు. దీనికి సాక్ష్యంగా తన యూఎస్ నంబర్కు వచ్చిన వాట్సాప్ కాల్ లాగ్లను ఆయన చూపించారు. “ఈ తెలియని తారక్కి సునీత మాగంటి గారు ఎందుకు ఫోన్ చేయాలి? జూన్ 6న నాన్న అనారోగ్యం గురించి ఆవిడే నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో కూడా మాట్లాడారు. ఆవిడ కూతురు అక్షర మాగంటి కూడా నాకు కాల్ చేసింది. ఆ కాల్ లాగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి.” అని ఆయన పేర్కొన్నారు.
“నువ్వు రావద్దు, కేటీఆర్ అంకుల్తో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు”
ఈ సంభాషణల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని తారక్ సంచలన ఆరోపణ చేశారు. తనను అమెరికా నుండి ఇండియాకు రాకుండా ఆపేందుకే ఈ నాటకం ఆడారని అన్నారు. “నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, జాబ్ వెతుకుతున్నా అని చెప్పాను. దానికి ఆవిడే ఫోన్ చేసి, ‘నువ్వు ఇండియా రావక్కర్లేదు, నీ రెజ్యూమె పంపించు. ఇక్కడ కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీలు ఉన్నాయి, మేము చూసుకుంటాం.‘ అని చెప్పారు. ఇదంతా నన్ను బ్రెయిన్వాష్ చేసి, ఇక్కడ వాళ్లు చేసుకునే చట్టపరమైన పనులకు అడ్డులేకుండా చూసుకోవడానికే.” అని తారక్ ఆరోపించారు.
అంత్యక్రియలకు రానివ్వకుండా బెదిరించారు
తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాకుండా తనను అడ్డుకున్నారని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. “కొంతమంది యాంటీ-సోషల్ ఎలిమెంట్స్, బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నన్ను బెదిరించి అంత్యక్రియలకు రాకుండా చేశారు.” అని ఆయన నేరుగా ఆరోపణలు చేశారు. తనను రానివ్వకపోగా, తన పెద్దనాన్న మరియు నాన్నమ్మపై లేనిపోనివి కల్పించి చెప్పారని, “వాళ్లు శవంతో రాజకీయాలు చేస్తున్నారు, వాళ్లతో మాట్లాడకు.” అని సునీత తనతో చెప్పి, కుటుంబంలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేశారని తారక్ ఆవేదన చెందారు.
దొంగచాటుగా ఫ్యామిలీ సర్టిఫికెట్
తాను యూఎస్లో ఉండగానే, తనతో మాట్లాడుతూనే, ఇక్కడ దొంగచాటుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారని తారక్ అన్నారు. “జూన్ 25న వాళ్లు సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు, జూలై 4న అది వచ్చేసింది. కానీ నాతో జూన్ 7 నుండే క్లోజ్గా మాట్లాడుతూ నా ప్లాన్స్ అడిగి తెలుసుకున్నారు. నా వెనుక ఇంత కుట్ర జరుగుతోందని నాకు తెలియలేదు.” అని అన్నారు. దివంగత ఎమ్మెల్యే చట్టబద్ధమైన కుమారుడిగా తనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతానని, ఈ కుట్రను బయటపెడతానని తారక్ స్పష్టం చేశారు.
Read Also: Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్కు మాగంటి గోపీనాథ్ తల్లి