Mahesh Kumar Goud: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఏకపక్షంగా తిరస్కరించడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం
మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన పరిధికి మించి వ్యవహరించారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిబంధనల ప్రకారం కోర్టు నోటీసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును, నోటీసులను సాకుగా చూపి అత్యంత నిజాయితీపరురాలైన మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా ఎన్నికైనట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు.
బీజేపీ ద్వంద్వ విధానాలు
బీజేపీ అనుకూల అభ్యర్థుల విషయంలో ఒకలా, ప్రతిపక్షాల విషయంలో మరోలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ దుయ్యబట్టారు. జార్ఖండ్లో తప్పులతడకగా ఉన్న ఎన్డీయే మద్దతుదారుడైన ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ను సజావుగా స్వీకరించిన అధికారులు, ఇక్కడ మాత్రం కావాలనే కొర్రీలు పెట్టారని వేలెత్తి చూపారు. పైగా, ఫిర్యాదుదారుడు కోర్టు నోటీసుల సమాచారాన్ని ఒక రోజు ముందే వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
తప్పుడు ప్రచారాలపై స్పష్టత
తెలంగాణ కాంగ్రెస్ నేతలే మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా ఖండించారు. కాంగ్రెస్లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, ఇదంతా తమ వైఫల్యాలను, కుట్రలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని కొట్టిపారేశారు. ఈ అప్రజాస్వామిక చర్యపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. సుమోటోగా కేసు నమోదు!