Raja Singh: స్వేచ్ఛ బ్యూరో: హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ తన పదవీకాలంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో గొప్పగా వ్యవహరించినప్పటికీ, కొన్ని విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆయన తన హయాంలో మంచి, చెడు రెండూ చేశారని రాజాసింగ్ పేర్కొన్నారు.
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ
రంగనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించబడిందని రాజాసింగ్ కొనియాడారు. కేవలం నగరం మొత్తంలోనే కాకుండా, తన సొంత నియోజకవర్గమైన గోషామహల్లో కూడా సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడి, దానికి ఫెన్సింగ్ కూడా వేయించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడిన విషయంలో ఆయన పనితీరు అభినందనీయమన్నారు.
ఫాతిమా కాలేజీపై చర్యలేవి?
అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో రంగనాథ్ కొంత పక్షపాతం చూపారనే అభిప్రాయాన్ని రాజాసింగ్ వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ప్రచారంలో ఉన్న ‘ఫాతిమా కాలేజీ’ ని గనుక రంగనాథ్ కూల్చివేసి ఉంటే, తమలాంటి వారమంతా ఆయనకు జై కొట్టే వాళ్ళమని తెలిపారు. రంగనాథ్ స్థానంలో రాబోయే కొత్త అధికారి అయినా ఫాతిమా కాలేజీని కూలుస్తారా లేదో చూడాల్సి ఉందన్నారు. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగనాథ్కు అండగా ఉంటారా? లేక చేతులెత్తేస్తారా? అనేది వేచి చూడాలన్నారు.
ప్రైవేట్ భూముల విషయంలో జోక్యం
రంగనాథ్ చేసిన పొరపాట్లను ఎత్తిచూపుతూ.. న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రైవేట్ భూముల విషయంలో ఆయన అనవసరంగా జోక్యం చేసుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. కోర్టు చెప్పినా వినకుండా కొన్ని చోట్ల ప్రైవేట్ ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పని వ్యాఖ్యానించారు.