Bonda Uma: అమరావతి వేదికగా నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల ముద్రగడ సంస్మరణ సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం, పార్టీ పరంగా చర్చకు దార తీయడంపై ఆయన తన స్వరాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల విమర్శలను, సోషల్ మీడియా ట్రోలింగ్ను ఆయన తీవ్రంగా ఖండించారు.
దుష్టశక్తుల కుట్రలపై ఫైర్
సంస్మరణ సభలో గతంలో జరిగిన విషయాలనే తాను మరోసారి మాట్లాడానని.. అందులో కొత్తగా దాచాల్సింది ఏమీ లేదని బోండా ఉమా తెలిపారు. అయితే, కొందరు దుష్టశక్తులు కావాలనే తన మాటలకు విపరీతార్థాలు తీస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సభకు కేవలం తాను మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారని గుర్తుచేశారు. ఒకవేళ వివరణలు అడగాలనుకుంటే.. ఆ సభలో పాల్గొన్న సగం మంది కాపు నాయకుల నుంచి కూడా వివరణ తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
పార్టీకి ఇబ్బంది పెట్టలేదు.. కమిటీ ముందుకు హాజరవుతా!
ఈ వ్యవహారంలో పార్టీ తనపై సీరియస్గా ఉందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ‘నేనేంటో అధినేతకు బాగా తెలుసు, పార్టీ క్రమశిక్షణ ఏంటో నాకు తెలుసు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు’ అని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ ముందుకు హాజరై.. వారు అడిగే ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన వివరణ ఇస్తానని స్పష్టం చేశారు.
కష్టపడే ఈ స్థాయికి వచ్చాను
రాజకీయాల్లోకి తానేమీ సులువుగా, ‘కేక్ వాక్’ చేసుకుంటూ ఈ స్థానానికి రాలేదని బోండా ఉమా వ్యాఖ్యానించారు. ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొని ఇక్కడిదాకా వచ్చానన్నారు. ఇలాంటి చిన్న చిన్న వివాదాలకు లేదా బెదిరింపులకు భయపడే రకం తాను కాదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రయోజనాలకే తన మొదటి ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు.
Also Read: ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్