Illegal Mining: శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని మూడుచింతలపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి ఎదురుగా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 24 రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మూడుచింతలపల్లి రైతు వేదిక దాటి అటవీ ప్రాంతం ఎదురుగా కొందరు అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.
ఎస్హెచ్వో ఆదేశాల మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా రెండు జేసీబీలు, ఒక టిప్పర్ లారీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అనంతరం మట్టి తరలించేందుకు మరో మూడు టిప్పర్ లారీలు అక్కడికి చేరుకున్నాయి. విచారణలో జేసీబీ డ్రైవర్లు రషీద్, సద్ది ఖాన్, టిప్పర్ యజమాని-డ్రైవర్ వంగ రాజిరెడ్డి, అలాగే టిప్పర్ డ్రైవర్లు శేఖర్, శ్రీకాంత్, చందన్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండానే మట్టి తవ్వి తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ‘బిగ్ టీవీ’ రీలాంచ్.. గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్రెడ్డి!
ఈ తవ్వకాలు వంగ రాజిరెడ్డి, తిప్పరబోయిన శివ, పొన్న మధు, శివరాత్రి సాయి ఆదేశాల మేరకు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!