Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరిస్తూ కేసు నమోదు చేసింది. ఫ్యాక్టరీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇంతటి అనర్థం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి నోటీసులు జారీ చేసింది. ప్రమాదం ఎలా జరిగింది? దీనికి గల కారణాలేంటి? అనే అంశాలపై రాబోయే రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు కనీస చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. అలాగే, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కార్మికులకు అందుతున్న వైద్య సేవలు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని స్పష్టం చేసింది. భద్రతా లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read: మేమే కాక్రోచ్.. తొక్కేయాలని చూస్తే అంతే సంగతి.. జగన్ సంచలన వ్యాఖ్యలు