Malkajgiri Corporator Shravan: హైదరాబాద్లోని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న సఫిల్ గూడా (మినీ ట్యాంక్ బండ్) చెరువు వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చెరువు అభివృద్ధి పనుల్లో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆయన ఏకంగా చెరువు కట్టపై నుండి నీటిలోకి దూకేందుకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. గత కొంతకాలంగా చెరువు సుందరీకరణ మరియు మరమ్మతు పనుల విషయంలో అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో కార్పొరేటర్ సహనం కోల్పోయి ఈ నిరసనకు దిగారు.
ఘటనా స్థలంలో అధికారులతో జరిగిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. “ఇన్ని రోజులు తమాషాలు చేస్తున్నారా? వంద రోజులు దాటుతున్నా పనులు ఎందుకు చేయడం లేదు? గంటలో చేస్తారా లేక గాడిదలు కాస్తున్నారా?” అంటూ కార్పొరేటర్ శ్రవణ్ అధికారులను తీవ్ర పదజాలంతో నిలదీశారు. పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు సమాధానం దాటవేస్తున్నారని ఆరోపిస్తూ, “మీరు పనులు చేస్తామంటేనే నేను ఇక్కడి నుండి వెళ్తా.. లేదంటే ఇప్పుడే చెరువులో దూకి చచ్చిపోతా” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి చేయడం తన ఒక్కడి వ్యక్తిగత పని కాదని, ఇది ప్రజలందరి అవసరమని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పనులు చేయించలేకపోతే చనిపోవడమే మేలని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
ఇదే సమయంలో అభివృద్ధి పనుల జాప్యం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కార్పొరేటర్ శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. “ఎమ్మెల్యే మా మీద లెటర్ రాసిండు సార్” అంటూ అధికారులు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని కార్పొరేటర్ విమర్శించారు. ఎమ్మెల్యే పని చేయొద్దని చెబుతున్నాడని, అధికారులు ఆ నెపం చూపి పనులు ఆపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విద్వేషాలతో ప్రజావసరమైన చెరువు పనులను ఆపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
అధికారులు కావాలనే పనులను డిలే (Delay) చేస్తున్నారని, నిధులు శాంక్షన్ అయినా పనులు ముందుకు సాగడం లేదని వాపోయారు. తాను ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నానని అన్నారు. “పాము కరిస్తే కాదు.. పనులు చేయకపోతే నేనే దూకి చచ్చిపోతా” అంటూ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారిని ఆందోళనకు గురిచేశాయి. ఈ హైడ్రామాతో సఫిల్ గూడా చెరువు కట్టపై కాసేపు గందరగోళం నెలకొంది. స్థానికులు, కార్యకర్తలు ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి చెరువు అభివృద్ధి పనుల వ్యవహారం మల్కాజిగిరిలో పొలిటికల్ హీట్ పెంచింది.
Read Also: Telangana North East Connect: అప్పుడు మమ్మల్ని ‘మద్రాసీలు’ అన్నారు.. మీ బాధ మాకు తెలుసు: సీఎం రేవంత్