Mallu Ravi latest news(Telangana politics): నాగర్ కర్నూల్.. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో ఒకటి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ఈ సీటును తిరిగి ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో ఉంది హైకమాండ్. అందుకే.. క్యాండిడేట్ విషయంలో పక్కాగా పావులు కదుపుతోంది. మరి నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా బరిలోకి దిగబోయేదెవరు?
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరును క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రత్యేక వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ప్రత్యేకించి నాగర్కర్నూల్లో ఘనవిజయం సాధించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లురవిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మల్లురవి.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. కాంగ్రెస్ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, పార్టీకి ఏ అవసరం వచ్చినా తక్షణం వాలిపోయి పనిచేసుకుంటూ వెళ్లిపోయే లీడర్. పార్టీలో సీనియర్ మోస్ట్ అయినా, ఇప్పటికీ సామాన్య కార్యకర్తలానే నడుచుకోవడం ఆయన నైజం. హంగూ ఆర్భాటాలాకు దూరంగా ఉండే తత్వమే ఆయన్ను అందరివాడిని చేసింది. లోక్సభ బరిలో మరోసారి నిలబెడుతోంది. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయమని ఆహ్వానిస్తోంది.
నాగర్కర్నూలు లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు మల్లు రవి. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 2019ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా నాగర్ కర్నూలుతో తన అనుబంధాన్ని తెంచుకోలేదాయన. అందుకే మరోసారి పోటీ చేయాలంటూ ఆయన్ను ఆహ్వానిస్తోంది నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ మల్లు రవి అభ్యర్థిత్వానికే జై కొడుతున్నారు. ఆయన బరిలోకి దిగితే గెలిపిస్తామంటూ హైకమాండ్కు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లా మంత్రి సపోర్ట్ చేయడంతో పాటు, ఎమ్మెల్యేలంతా మల్లు రవి అభ్యర్థిత్వానికే మద్దతు ఇస్తున్నారు. డీసీసీ కూడా ఆయన్ను పోటీ దింపితే గెలుస్తామని భావిస్తోంది. ఇలా అంతా ఒకే మాట చెబుతుండడంతో మల్లు రవికి దాదాపుగా టికెట్ కన్ఫమ్ అయినట్లే. అటు లోకల్గా చేసిన సర్వేల్లోనూ మల్లు రవి ముందంజలో ఉండడం ఆయనకు కలిసిరానుంది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంలో క్రియాశీల పాత్ర పోషించారు మల్లు రవి. అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించినా పార్టీ అవసరాల దృష్ట్యా వెనక్కి తగ్గారు. కానీ పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. పార్టీ ఇచ్చిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అందర్నీ సమన్వయం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికల సమయంలో అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను కూడా హైకమాండ్ మల్లు రవికే అప్పగించింది. దానిని కూడా విజయవంతంగా పూర్తి చేసి, రెబల్స్ బెడద లేకుండా చేశారాయన. హైకమాండ్ ప్రశంసలు అందుకున్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పార్టీ కోసం మాత్రం నిస్వార్థంగా పనిచేసే వాళ్లలో మల్లురవి ముందుంటారన్నది కాంగ్రెస్ నేతల నుంచి వినిపించే టాక్. అటు జనంలోనూ అదే ఫీలింగ్ కనిపిస్తుండడంతో ఆయన అభ్యర్థిత్వానికే లైన్ క్లియర్ అయ్యేలా ఉందన్నది గాంధీభవన్ వర్గాల మాట.