Medaram Jatara 2026: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహా జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. ఈ నెల 28న ప్రారంభం కాబోతుంది. కేవలం జాతర జరిగే 4 రోజుల్లోనే వేల కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ జరుగుతుందంటే ఈ జాతర ఆర్థిక ప్రాముఖ్యతేంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు జాతరకు తరలివస్తారు. రవాణా, వ్యాపారం, వసతి వంటి రంగాల్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
మేడారం జాతరలో అమ్మవార్లకు సమర్పించే అత్యంత పవిత్రమైన నైవేద్యం బెల్లం. ఇక్కడ భక్తులు బెల్లాన్ని సాక్షాత్తు ‘బంగారం’గా భావించి కొలుస్తారు. తమ ఎత్తుకు సరిపడా బెల్లాన్ని (తులాభారం) తూచి అమ్మవార్లకు సమర్పించుకోవడం మేడారంలో అనాదిగా వస్తున్న విశిష్ట ఆచారం, కోట్లాది మంది భక్తులు ఈ మొక్కును చెల్లించుకుంటారు కాబట్టి, బెల్లం ఇక్కడ ప్రధాన వ్యాపారం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి వందల టన్నుల కొద్దీ బెల్లాన్ని వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. డిమాండ్ విపరీతంగా ఉండటంతో ధరలు పెరిగినప్పటికీ, భక్తులు కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.
మేడారం జాతర అంటేనే భక్తిశ్రద్ధలతో పాటు విందువినోదాలకు ప్రసిద్ధి. వనదేవతల దర్శనం అనంతరం అడవిలోనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సహపంక్తి విందులు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ సంప్రదాయం కారణంగా జాతర సీజన్లో మాంసం విక్రయాలు ఆకాశాన్ని తాకుతాయి. కేవలం జాతర జరిగే ఈ నాలుగు రోజుల్లోనే మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో భారీ ఆదాయం సమకూరుతుంది.
మేడారం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ భక్తుల కోసం ఎలాంటి స్టార్ హోటళ్లుగానీ, లాడ్జీలు గానీ అందుబాటులో ఉండవు. తమ ఇంటి ఆవరణలను, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములను చదును చేసి టెంట్లు వేసి భక్తులకు అద్దెకు ఇస్తారు. డిమాండ్ను బట్టి ఒక్కో టెంట్కు, మంచాలకు వేల రూపాయల్లో అద్దెలు వసూలు చేస్తారు.
జాతరలో కేవలం పెద్ద వ్యాపారాలే కాదు, చిరు వ్యాపారుల సందడి కూడా ఊపందుకుంటుంది. అమ్మవార్లకు సమర్పించే కొబ్బరికాయలు, పూలు, పసుపు-కుంకుమ, ఒడిబియ్యం వంటి పూజా సామాగ్రి నుంచి.. మహిళలు ఇష్టపడే గాజులు, బట్టలు, పిల్లల ఆటవస్తువులు, తినుబండారాల వరకు అన్నీ అక్కడ లభిస్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది చిన్న వ్యాపారులు వారం రోజుల ముందే మేడారం చేరుకుని స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారు.
మేడారం జాతరలో విందులు, వినోదాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో, మద్యం విక్రయాలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. జాతర మొక్కుల్లో భాగంగా మాంసాహార విందులు చేసుకునే భక్తులు మద్యాన్ని కూడా ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో ఈ సీజన్లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి.
మేడారం జాతరలో వ్యాపారం చేయాలనుకునేవారు కేవలం పెట్టుబడి, సరుకులు సిద్ధం చేసుకుంటే సరిపోదు, దానికి సంబంధించిన అధికారిక అనుమతులు పొందడం అత్యంత కీలకం. జాతరకు దాదాపు రెండు, మూడు నెలల ముందు నుంచే మేడారం గ్రామ పంచాయతీ, దేవాదాయ శాఖ, ఐటీడీఏ (ITDA) ఆధ్వర్యంలో వేలం పాటల (Auctions/Tenders) ప్రక్రియ మొదలవుతుంది. ప్రధానంగా వాహనాల పార్కింగ్ స్థలాలు, తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టలు, కొబ్బరికాయల స్టాల్స్, ప్రధాన కూడళ్లలో షాపుల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తారు.
ఈ టెండర్ల కోసం స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా పోటాపోటీగా పాల్గొంటారు. ముందుగానే టెండర్ దక్కించుకోకుండా, అనుమతి లేకుండా అనధికారికంగా షాపులు పెడితే అధికారులు వాటిని తొలగించే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాపారం చేయాలనుకునేవారు పత్రికా ప్రకటనలను గమనిస్తూ, నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకోవడం సురక్షితం.
Read Also: డబ్బుకు కొరత ఉండకూడదా ? అయితే వాస్తు రహస్యాలు మీకోసం