ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల తాకిడి మొదలైంది. అమ్మ వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ వినూత్నంగా హెలి రైడ్ పేరుతో హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆధ్యాత్మికతకు సాహసాన్ని జోడిస్తూ, గంటల కొద్దీ ట్రాఫిక్లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో గమ్యాన్ని చేరేలా ఈ ఏర్పాట్లు చేశారు.
పర్యాటక శాఖ హనుమకొండ, మేడారం వద్ద రెండు ప్రత్యేక హెలికాప్టర్లను కేటాయించింది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని బేస్ క్యాంపుగా మార్చి, అక్కడి నుండి మేడారం హెలిప్యాడ్ వరకు భక్తులను చేరవేస్తున్నారు. కేవలం ప్రయాణమే కాకుండా, మేడారం పరిసరాల్లోని అటవీ అందాలను, జాతర వైభవాన్ని ఆకాశం నుండి వీక్షించాలనుకునే వారి కోసం ఏరియల్ వ్యూ సేవలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.
రౌండ్ ట్రిప్: హనుమకొండ నుండి మేడారం వెళ్లి, అమ్మవార్లను దర్శించుకుని తిరిగి రావడానికి ఒక్కో వ్యక్తికి రూ. 35,999 గా నిర్ణయించారు.
ఏరియల్ వ్యూ: మేడారం జాతర పరిసరాలను ఆకాశం నుండి ఆరు నిమిషాల పాటు వీక్షించేందుకు ఒక్కో భక్తుడికి రూ. 4,800 ఛార్జ్ చేస్తున్నారు.
ఈ సేవలు జనవరి 23 నుండి జనవరి 31 వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:20 గంటల వరకు హెలికాప్టర్లు నిరంతరాయంగా నడుస్తాయి.
భక్తులు తమ టికెట్లను హెలి టాక్సీ (Heli Taxi) అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా పర్యాటక శాఖ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. రోడ్డు మార్గంలో వెళ్తే ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి, అలాగే వృద్ధులు, త్వరగా దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఈ సేవలు గొప్ప వరమని చెప్పవచ్చు. దట్టమైన అడవుల మధ్య కొలువైన మేడారం వైభవాన్ని ఆకాశం నుండి చూడటం భక్తులకు ఒక మధురమైన అనుభూతిని మిగిలిస్తోంది.
ALSO READ: Medaram Jatara: మేడారం జాతరకు భారీగా కేంద్ర నిధులు.. రూ.3.70 కోట్లు విడుదల చేసిన మోదీ సర్కార్