మేడారం మహా జాతరలో చోటు చేసుకున్న ఒక విషాద ఘటన భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. వనదేవతల సేవలో తరించే పూజారి కుటుంబంలో పెను విషాదం నింపింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినా భక్తుల తాకిడి తగ్గలేదు. ఈ క్రమంలోనే గద్దెల వద్ద జరిగిన ప్రమాదం ఒక చిన్నారి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వనదేవతల పూజారి సిద్ధబోయిన రాణా రమేష్ కుమారుడు యువన్ ఈ ప్రమాదానికి గురయ్యాడు.
ఆరో ఏటనే ఆ బాలుడు వైకల్యం బారిన పడటం అందరినీ కలిచివేస్తోంది. గద్దెల వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో అక్కడ ఉన్న ఒక భారీ రాయి చిన్నారి కాళ్లపై పడటమే ఈ అనర్థానికి దారి తీసింది. సాయంత్రం సమయంలో తండ్రితో కలిసి గద్దెల వద్దకు వెళ్లిన యువన్ అక్కడ నిర్మాణంలో ఉన్న రాయిపై కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు ఆ రాయి కదలడంతో బాలుడు కింద పడిపోయాడు. వెంటనే ఆ బరువైన రాయి అతడి కాళ్లపై పడటంతో ఎడమ కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కుడి కాలు విరిగి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బాలుడిని ములుగు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. రెండు కాళ్లకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుడి కాలు ఎముక విరగడంతో ఆపరేషన్ చేసి రాడ్ అమర్చారు. ఎడమ కాలు పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారైంది.
ఆరేళ్ల వయస్సులోనే అంగవైకల్యం.
ఎడమ కాలిలో రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ ఇతర శరీర భాగాలకు పాకే ప్రమాదం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కాలును తొలగించాలని నిర్ణయించారు. గురువారం నాడు బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఎడమ కాలి మడమ పై వరకు తొలగించారు. ఆరేళ్ల వయసులోనే ఒక కాలు కోల్పోయి యువన్ అంగవైకల్యంతో మిగిలిపోయాడు.
‘చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
ప్రభుత్వం మేడారం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించినా పనుల వద్ద సరైన జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి ఇప్పుడు ఆసుపత్రి బెడ్పై అచేతనంగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక కాలు పోవడమే కాకుండా మరో కాలికి రాడ్ వేయడంతో ఆ బాలుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై మేడారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ALSO READ: రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలైతే.. ఇప్పుడే రాజీనామా చేస్తా, బండి సంజయ్ సంచలనం