Uppal Stadium: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని.. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు. ఈ నేపథ్యంలో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ టీ-20 మ్యాచ్కు.. ప్రేక్షకులను అనుమతించబోమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రకటించింది.
దీంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. తాజాగా జారీ చేసిన అధికారిక ప్రకటనలో, మ్యాచ్ రోజున ఒకరి కూడా స్టేడియం లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేమని HCA స్పష్టం చేసింది. దీనికి సంబంధించి భద్రతా సంస్థలు, పోలీసులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వరల్డ్ ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ “India GOAT Tour” లో భాగంగా.. డిసెంబర్ 13న హైదరాబాద్కి రానున్నారు. కోల్కతాలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అదే రాత్రి లేక మరుసటి రోజు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
మెస్సీ ఈవెంట్ను ఉప్పల్ స్టేడియంలో భారీ స్థాయిలో నిర్వహించనుండడంతో, ఒక వారం ముందుగానే స్టేడియం భద్రతా విభాగానికి పూర్తిగా అప్పగించాలని అధికారులు సూచించారు.
స్టేడియం లోపల, వెలుపల, పార్కింగ్ జోన్లు, ప్రాంగణం మొత్తాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. మెస్సీ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి హాజరుకావడంతో, ఎటువంటి లోపాలు ఉండకూడదనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడల అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెస్సీ – సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెస్సీ 10వ నంబర్ జెర్సీ, సీఎం 9వ నంబర్ జెర్సీ ధరించి యువ ప్రతిభావంతులతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభిస్తారని సమాచారం.
సామాజిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు, అకాడమీ ప్లేయర్లు ఈ మ్యాచ్లో పాల్గొనబోతున్నారు. మెస్సీ రావడంతో యువతలో ఉత్సాహం మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించకపోవడం క్రికెట్ అభిమానుల్లో నిరాశను కలిగించినా, మెస్సీ హైదరాబాద్ కు రావడమే వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఒకవైపు ప్రపంచ స్థాయి ఈవెంట్ నిర్వహణ జరుగుతుండగా, మరోవైపు క్రికెట్ మ్యాచ్ యధావిధిగా జరగడం కూడా ఒక సవాలు కావడంతో, అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు.