Minampally Hanumanth Rao: కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తే ఇక ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మైనంపల్లి, మీరు మాట్లాడితే సంసారం.. మేము మాట్లాడితే వ్యభిచారమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల భాషే రాజకీయాలను దిగజార్చిందని, పోలీసు అధికారులను, ఐఏఎస్ అధికారులను బూతులు తిట్టిన చరిత్ర మీదే అని మండిపడ్డారు.
T-న్యూస్ చానల్లో ఉండి సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. సహించేది లేదని మైనంపల్లి హెచ్చరించారు. డైరెక్ట్ చానల్కు వచ్చి మాట్లాడండి.. అప్పుడు సంగతి తెలుస్తుంది. అవసరమైతే T-న్యూస్ను నేలమట్టం చేస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ దాడులు చేస్తే.. కాంగ్రెస్ శ్రేణులు ఊరుకునేవి కావని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు మైనంపల్లి. నాయకులను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసింది మీరు కాదా? మంత్రులను కొనుక్కుని, పోలీసులతో కొట్టించి, బలవంతంగా పార్టీలో చేర్చుకున్నది మీరే అంటూ ప్రశ్నించారు. అసైన్మెంట్ భూములను అమ్మింది, దోచుకుంది కూడా మీరేనని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం పేరుతో ఆంధ్రా వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టారని, అదే సమయంలో తెలంగాణను మాత్రం ఎవడబ్బ సొమ్ము అన్నట్టు దోచుకున్నారని మండిపడ్డారు. కరప్షన్ చేసింది మీరు.. భాషను బ్రష్టుపట్టించింది కూడా మీరు కాదా? అంటూ నిలదీశారు.
హరీష్ రావు హజీజ్నగర్ చెరువులో పామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించిన మైనంపల్లి, ఆ నిర్మాణాన్ని హైడ్రా ద్వారా కూలగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కూడా విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నది వాస్తవం కాదా? అమెరికాలో చదువుకున్న కేటీఆర్కు సంస్కారం ఏదీ? అంటూ మైనంపల్లి ప్రశ్నించారు. చదువుకున్నా, చదువుకోకపోయినా సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం ఉన్న వ్యక్తి అని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి నిలబడే నాయకత్వం రేవంత్ రెడ్డిదేనని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే తన పనితీరును నిరూపించుకుందని మైనంపల్లి అన్నారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, పేదలకు రేషన్ కార్డులు అందించామని గుర్తు చేశారు. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా, పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు వద్దు! సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
మేము క్యాడర్కు పిలుపునిస్తే మీ అడ్రెస్ గల్లంతు అవుతుంది. మేము భాష మాట్లాడితే మీరు తట్టుకోలేరు అంటూ బీఆర్ఎస్ నేతలకు మైనంపల్లి హనుమంతరావు ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే రాజకీయంగా గట్టి సమాధానం తప్పదని స్పష్టం చేశారు.