Ponguleti Srinivas Reddy: తెలంగాణ హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బోర్డుకు సంబంధించిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో హౌసింగ్ బోర్డు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భూముల లీజు, కోర్టు కేసులు, బకాయిలు, అగ్రిమెంట్లపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇళ్లకు ఆనుకుని ఉన్న 100 గజాలలోపు ఖాళీ స్థలాల విషయంలో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి యజమానులు ఆసక్తి చూపిస్తే, ఆ పక్కనే ఉన్న చిన్న స్థలాన్ని వారికి విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, గతంలో బోర్డు నుంచి ఇల్లు/స్థలం పొంది రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు.
నిజాం కాలం నుంచి దాదాపు 115 సంస్థలు (పాఠశాలలు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఆలయాలు) హౌసింగ్ బోర్డు స్థలాల్లో లీజుకు ఉన్నాయి. లీజు అగ్రిమెంట్లు పునరుద్ధరించుకోని సంస్థలకు నోటీసులు ఇచ్చి, రెగ్యులరైజేషన్కు అవకాశం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అలాగే బోర్డు పరిధిలోని కమర్షియల్ షాపుల యజమానులు కొనుగోలుకు ముందుకు వస్తే, మార్కెట్ ధర ప్రకారం విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నిబంధనల ప్రకారం ఏటా 10 శాతం అద్దె పెంపు అమలు కాకపోవడం వల్ల బోర్డుకు కోట్లాది రూపాయల బకాయిలు రావాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు.
కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడుకునేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమించుకోవాలని మంత్రి సూచించారు. సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువ, ఖాళీ స్థలాల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందిస్తే, క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వి.పి. గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.