UBS Athletics Kids Cup: తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ క్రీడా హబ్గా (Sports Hub) తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘యూబీఎస్ (UBS) అథ్లెటిక్స్ కిడ్స్ కప్’ టోర్నమెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా పాల్గొన్నారు. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు మంత్రులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు యూబీఎస్ వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్’ ద్వారా గ్రామస్థాయిలో ఇప్పటికే 4 లక్షల మంది క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించామని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచి, గ్రామీణ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించే దిశగా ఒక పటిష్టమైన ‘స్పోర్ట్స్ పాలసీ’ని ప్రభుత్వం రూపొందిస్తోందని మంత్రి తెలిపారు. ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటామంటే వద్దని వారించే తల్లిదండ్రులు, నేడు స్వయంగా పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తుండటం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, కొత్త స్టేడియాల నిర్మాణంతో పాటు పాత వాటిని ఆధునీకరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా తాము అడుగులు వేస్తున్నామని, క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీహరి పిలుపునిచ్చారు.
Read Also: Beerla Ailayya: కేసీఆర్ను చూస్తే జాలేస్తుంది పాపం: బీర్ల అయిలయ్య