Danam Nagender: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేసిన నేపథ్యంలో… దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై ఆసక్తి నెలకొంది. కడియం శ్రీహరి తాను కాంగ్రెస్ లో చేరలేదని, మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానని చెబుతున్నారు. అయితే దానం నాగేందర్ కు ఆ అవకాశం లేకుండా పోయింది. లోక్ సభ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో స్పీకర్.. దానం నాగేందర్ పిటిషన్ పై ఏం చర్యలు తీసుకుంటారోననే ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ.. . రాజీనామా చేయడానికి తన ధైర్యం కార్యకర్తలే అన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉపఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తానని దానం ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అండతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. రాజీనామా చేయడానికి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తన ధైర్యం కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. సీఎం పదవికి బీఆర్ఎస్ నేతలు గౌరవం ఇవ్వడం మరిచారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏకవచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. అలాగే, మంత్రుల అవినీతిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దానం తప్పుపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ వద్దే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు నియామకం
తాను కాంగ్రెస్లోనే ఉన్నట్లు దానం నాగేందర్ తేల్చి చెప్పారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. అదే తన స్పెషాలిటీ అంటూ పేర్కొన్నారు.