Moinabad Drugs Case: స్వేచ్ఛ బ్యూరో: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. పార్టీ కోసం డ్రగ్స్ సప్లయ్ చేసిన సప్లయర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫార్మ్ హౌస్లో డ్రగ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఇటీవల ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తోపాటు మొత్తం 11మందిపై కేసులు నమోదయ్యాయి.
పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలు జైలుకు రిమాండ్ కాగా మిగితా నిందితులు స్టేషన్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయిన కౌశిక్ ను విచారించినపుడు కొకైన్ ను సిమ్లా నుంచి తెచ్చినట్టు చెప్పటంతో అధికారులు మొదట ఆ కోణంలో విచారణ జరిపారు. అయితే, పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ సిల్వెరీ శరత్ ను ప్రశ్నించినపుడు నిజానికి కొకైన్ ను అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి ఓఆర్ఆర్ వద్ద కొకైన్ కొన్నట్టు వెల్లడించాడు. దాంతో అధికారులు అభిషేక్ సింగ్ కోసం గాలింపు మొదలు పెట్టారు.
Also Read: Telangana Bills: మత పరమైన కామెంట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు
మొబైల్ నెంబర్ ఆధారంగా చివరకు అభిషేక్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లయ్ చెయ్యటం ఇదే మొదటిసారి కాదని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులకు గతంలో అతను డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అతని నుంచి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు? పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్నిసార్లు డ్రగ్స్ ఇచ్చాడు? అన్నదానిపై ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్టు తెలిసింది.
Also read: Telangana BJP: చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాషాయ దళం.. వారి డిమాండ్లు ఇవే..?