Kavitha Speech: నిజామాబాద్ పాంచజన్యం సంకల్ప సభలో కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సొంతగడ్డకు వచ్చాను కాబట్టి కన్నీరు ఆగట్లేదన్నారు. సొంత కుటుంబం బయటకు పంపిన తీరును గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మగారి ఇంటి వాళ్లు బయటకు పంపితే.. అత్తింటి వారు అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. అయితే తాను పిరికి వ్యక్తి కాదన్న కవిత.. తనపై అక్రమ కేసును పెట్టిన సీబీఐకి సుప్రీం కోర్టు ముట్టికాయలు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ప్రశాంతి రెడ్డిపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తండ్రీ బిడ్డలను విడదీయడంలో ప్రశాంత్ రెడ్డి ముఖ్యుడని పేర్కొన్నారు. జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను గానీ.. ప్రశాంత్ రెడ్డిని క్షమించేది లేదన్నారు. తన ఉసురు ఆయనకు తప్పక తగులుతుందని అన్నారు. ఆయనొక శకుని లాంటి వ్యక్తి అని ఆరోపించారు. బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచి.. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అయ్యారని అన్నారు. అయినా కేసీఆర్ ప్రశాంత్ రెడ్డినే నమ్ముతున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తనను అణగదొక్కే ప్రయత్నం చేశారని కవిత ఆరోపించారు.
Also Read: క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!
నిజామాబాద్ గడ్డ మీద నిలబడి కవిత ఓ ఛాలెంజ్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి 5 అసెంబ్లీలో టీఆర్ఎస్ జెండాను ఎగురువేస్తామని పేర్కొన్నారు. మళ్లీ ఒకసారి నిజామాబాద్ బిడ్డకు అవకాశం కల్పించాలని కోరారు. ఇక్కడి బీడీ కార్మికులకు పెన్షన్ రావడానికి ప్రధాన కారణం తానేనని పేర్కొన్నారు. తాను చెబితినే అప్పట్లో కేసీఆర్ పెన్షన్ ప్రారంభించారని అన్నారు. ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు షకీల్, బాజిరెడ్డి, జీవన్ రెడ్డి ఏనాడైనా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారా అంటూ కవిత ప్రశ్నించారు.
మరోవైపు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పై కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని కవిత గుర్తుచేశారు. కేసీఆర్ స్నేహితుడికి ఆ ఫ్యాక్టరీని అప్పజెప్పే కుట్ర జరిగిందన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ కు కవిత ఈ సందర్భంగా సవాలు విసిరారు. ఏడేళ్లుగా ఎంపీగా ఉండి జిల్లాకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ నుండి ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని పట్టుబట్టారు. మాధవనగర్ ఆర్ ఓబీ ఎందుకు పూర్తిచేయడం లేదని నిలదీశారు. ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?