Mancherial Tragedy: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు ఏడేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజయ్యతో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమార్తె అక్షితతో పాటు 18 నెలల కుమారుడు మహేందర్ ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రజిత తన పిల్లలతో కలసి లింగాపూర్లోని పుట్టింట్లోనే నివాసముంటోంది. అయితే అంజయ్య తరచూ పిల్లలను చూసేందుకు ఇక్కడికి వస్తుండేవాడు.
ఆదివారం ఉదయం కూడా రజిత తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా భర్త అంజయ్య ఎప్పటిలాగే పిల్లలను చూడటానికి వచ్చి తిరిగి వెళ్లాడు. అతను వెళ్లిపోయిన కొద్దిసేపటికే రజిత తన చిన్న కుమారుడిని ఇంట్లోనే నిద్రపుచ్చింది. అనంతరం కుమార్తె అక్షితను వెంటబెట్టుకుని గ్రామం సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ కుమార్తెను తన నడుముకు కట్టుకుని బావిలోకి దూకి ప్రాణాలు తీసుకుంది.
Also Read: చికెన్ కోసం ఘోరం.. ఎక్కువ ముక్కలు తిన్నాడని.. స్నేహితుడి దారుణ హత్య!
ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు బావిలో మృతదేహాలు తేలియాడుతుండటం గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆత్మహత్యకు గల బలమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక ఎస్సై రాజవర్ధన్ వెల్లడించారు. మరోవైపు ఆత్మహత్యకు ముందు రజిత జన్నారంలో ఉంటున్న తన సోదరికి కాల్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే కుమార్తెను వెంటబెట్టుకొని వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.