మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో మరో కొత్త జగడం తెరపైకి వచ్చింది. చాలా కాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని, ఈసారైనా తమ రాజకీయ జీవితాన్ని పరిక్షించుకోవాలని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో వారంతా సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు ఎలా ఇస్తారని స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సదరు నేతలు నిలదీస్తున్నారు. అంతటితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం ముద్రించిన కరపత్రాలు, పార్టీ కండువాలను పలు చోట్ల తగలబెట్టారు. ఈ విషయం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
గత సర్పంచ్ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తామని స్థానిక నేతలు ఆశలు కల్పించినట్టు తెలుస్తున్నది. అయితే, ఈసారి టికెట్ తమకే వస్తుందని సర్వం ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్న వారికి చివరి నిమిషంలో టికెట్ రాలేదని తెలిసి తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టినట్టు సమాచారం. దీనికి తోడు పార్టీ నేతలకు శాపనార్ధాలు పెట్టినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారం కాస్త సీరియస్గానే మారింది. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ఎదుట పలువురు బీఆర్ఎస్ నేతలు కరప్రతాలు, కండువాలను దగ్దం చేశారు. టికెట్లు అమ్ముకుని మమ్మల్ని మోసం చేస్తావా? అంటూ ఆయన ఇంటి ఎదుట పెద్దఎత్తున నిరసనలు తెలిపినట్టు తెలుస్తున్నది.
ఇక చొప్పదండిలోనూ ఇదే తరహా ఘటన దర్శనమిచ్చింది. ఓ మహిళ తనకు టికెట్ దక్కలేదని రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ స్థానిక లీడర్లపై దుమ్మేత్తిపోసింది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తమకు టికెట్ ఇస్తానని నమ్మించి చివరి నిమిషంలో వేరే వారికి అమ్ముకున్నారని ఆరోపిస్తూ దంపతులు ఆయన ఇంటి వద్ద పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్యా చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీ పెద్దలకు సిట్ రూపంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే.. తాజాగా జిల్లా, స్థానిక నేతల తీరుతో కిందిస్థాయిలోనూ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
పార్టీలో టికెట్ల అమ్ముడు వ్యవహారంపై గులాబీ పెద్దలు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆశావహులు కోరుతున్నారు. ఇప్పటికే పార్టీ అధికారానికి దూరం అయ్యిందని.. నిజాయితీగా పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్లు ఇవ్వకపోతే భవిష్యత్లో అధికారంలోకి రావడం కష్టమేనని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమై పార్టీ కోసం కష్టించి పనిచేసే వారికి కాకుండా, నిన్న గాక మొన్న వచ్చిన వారికి, డబ్బు పలుకుబడి ఉన్నాయని వారికి టికెట్లు కేటాయిస్తే అసలైన కార్యకర్తలు పార్టీని వీడే అవకాశం లేకపోలేదని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై గులాబీ అధిష్టానం దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.