Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజకీయ సెగలు నీటి సమస్యకు దారితీశాయి. తమ వార్డుపై సర్పంచ్ కక్షగట్టి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని, కనీసం తాగడానికి నీళ్లు కూడా రాకుండా చేస్తున్నారంటూ 9వ వార్డు సభ్యురాలు బండి సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తన కాలనీ మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆమె, అక్కడ బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
కాగితాల్లోనే మోటార్ల బిగింపు..
ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు రోజుల క్రితం జరిగిన గ్రామసభలో తమ వార్డులోని బోరుకు కొత్త మోటారు బిగించి నీటి సరఫరా పునరుద్ధరించినట్లు తీర్మానం చేశారని, కానీ వాస్తవానికి అక్కడ ఎలాంటి మోటారు బిగించలేదని ఆమె ఆరోపించారు. పనులు చేయకుండానే అప్పుల లెక్కల్లో చూపిస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా సర్పంచ్ మాట విని పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
వాటర్ ట్యాంకర్ వెనక్కి పంపివేత
కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో ఈరోజు ఉదయం వార్డుకు వచ్చిన వాటర్ ట్యాంకర్ను కూడా సర్పంచ్ కావాలనే వెనక్కి పంపించారని సుమలత ఆరోపించారు. తాము కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులం కావడంతోనే, రాజకీయ కక్షతో తమ వార్డులో అభివృద్ధి జరగకుండా సర్పంచ్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవసరమైన మంచినీటి విషయంలోనూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
పొంతన లేని సమాధానాలు
నిరసన నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి రమేష్ను వివరణ కోరగా, ఆయన చెబుతున్న సమాధానాలు కాలనీ వాసులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. మోటారు ఇంకా బిగించలేదని చెబుతూనే, పంచాయతీలో ఉన్న పాత మోటార్లను వేరే పనుల కోసం పక్కన పెట్టామంటూ పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. దీంతో వార్డు సభ్యురాలు, మహిళలు కార్యాలయ ఆవరణలోనే నిరసనను కొనసాగించారు. తమ వార్డుకు తక్షణమే నీటి సరఫరా చేయాలని, రాజకీయ వివక్షను పక్కన పెట్టి అభివృద్ధి పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రీచార్జ్ చేయలేదని ప్రియుడిపై అలిగి.. మహిళ ఆత్మహత్య!