బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇతర పార్టీల్లో పదవులు రాక, సరైన గుర్తింపు దొరకని వారంతా ఇప్పుడు గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నపార్టీ ప్రతిపక్షంలోకి.. ప్రతిపక్షంలో ఉన్న వారు పవర్లోకి రావడం రాజకీయాల్లో కామన్. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు నిత్యం మారుతూనే ఉంటాయి. ప్రస్తుతం వారికి అధికార పార్టీ మీద మంచి అభిప్రాయం ఉండొచ్చు. సర్కారు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరని క్రమంలో వారిలో అసహనం పెరుగుతూ పోతుంటుంది.గతంలో అదే విధంగా జరగడంతో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది.
రాజకీయ నేతలు ఎవరైనా ఈ రోజుల్లో ప్రజాసంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని.. కేవలం వారి పదవులు, హోదాలు మాత్రమే చూసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ పార్టీలో పదేండ్లు మంత్రి లేదా ఇతర పదవులు అనుభవించిన ఓ నేతకు.. కొంచెం ప్రాధాన్యత తగ్గితే చాలు. వెంటనే పార్టీ మార్పు గురించి ఆలోచన చేస్తుంటారు. వేరే పార్టీలో తనకు ప్రాధాన్యత దొరుకుతుందా? ఎన్నికల్లో పోటీకి బీఫాం ఆఫర్ చేస్తారా? మంత్రి పదవిపై భరోసా ఇస్తారా? తన అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ లభించాకే ముహూర్తం చూసుకుని మరీ పార్టీ మారేందుకు సిద్ధం అవుతుంటారు. ఇాలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇప్పటికే చాలా జరిగాయి. గత ప్రభుత్వంలో ఒక టర్ము మంత్రిగా పనిచేసిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ప్రతిపక్షంలో వారంతా అధికార పార్టీని, నేతలను విమర్శిస్తుంటారు. తీరా పదవులకోసం అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు గోడలు దూకుతుంటారు.ఫలితంగా మొన్నటిదాక తిట్టిన నోటితోనే పొగుడుతుంటారు.గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజకీయ చదరంగంలో పార్టీలతో పనిలేదు. వ్యక్తులతోనూ సంబంధం లేదు. కేవలం పదవులు, హోదాలతోనే సంబంధం. మొత్తంగా దీనంతటిని డబ్బు, పరపతి, కులం వంటి అంశాలు ముందుండి నడిపిస్తుంటాయి.తాజాగా ఇదే విషయాన్ని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రూవ్ చేశారని రాష్ట రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.
కిరణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా? ఆ తప్పు వల్లే ఆయన రాజకీయాలకు దూరమయ్యారా?
సుమారు 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన సీనియర్ నేత.. సీఎం రేవంత్ ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత దక్కలేదని బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ వయసులోనూ పదవులు, టికెట్లు దక్కడం లేదని.. ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ మార్పు ఎంత వరకు సమంజసం అని పలువురు విమర్శిస్తున్నారు. మంత్రిగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయనకు.. ఇంకేం పదవులు కావాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రేపటి రోజున బీఆర్ఎస్లోనూ ప్రాధాన్యత దొరక్కపోతే మరల పార్టీ మారుతారా? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు కొందరు. కాగా, ఇప్పుడు కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించి పదవులు ఆఫర్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక పాతవారికి హ్యాండ్ ఇస్తారా? లేక కొత్తవారికి హ్యాండ్ ఇస్తారా? చర్చ జరుగుతున్నది.