సమైక్య రాష్ట్రంలోని మన సీఎం కిరణ్కుమార్ రెడ్డి గుర్తున్నాడా? దాదాపుగా అంతా మరిచిపోయారు. తాజాగా హైదరాబాద్లో ఓ కాంగ్రెస్ సీనియర్ నేత మనవరాలి పెళ్లికి హాజరై అందరికీ కనిపించాడు. తన శిష్యుడు అజారుద్దీన్తో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించాడు ( మంచి క్రికెటర్ అయిన కిరణ్కుమార్రెడ్డి… అజార్కు క్రికెట్లో సపోర్టుగా నిలిచాడు). ఇప్పుడు మళ్లీ ఆయన ముచ్చట వచ్చింది కాబట్టి.. అప్పుడేం జరిగింది? ఆయన ఒక్కసారిగా సీఎంగా వెలిగిపోయి.. ఆ తరువాత తెలంగాణ ఏర్పాటు అంశం కీలక మలుపు తిరిగిన సమయంలో ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు మనం అదే చర్చించుకోబోతున్నాం.
రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత అపద్దర్మ ముఖ్యమంత్రిగా రోషయ్యను పెట్టిన అధిష్టానం ఆ తరువాత కొద్ది కాలానికే సీఎం కిరణ్కుమార్ రెడ్డిని సీఎం చేసింది. అప్పటి వరకు ఆయన తెరపైన లేదు. అసలు రాజకీయాల్లో పెద్దగా ఉనికే లేదు. కానీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉన్న నేతల్లో ఒకడు. నమ్మినబంటుగా ఉన్నవారిలో కిరణ్కుమార్రెడ్డి కూడా ఉన్నాడు. అందుకే ఆయన పేరును సూచించింది అధిష్టానం.
తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పటికే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష తదితర పరిణామాలతో అధిష్టానం కూడా తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ప్రకటనే తరువాయిగా ఉంది. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ఢిల్లీ పెద్దలు ఆ రోజు ప్రకటిస్తారనే సమయంలో ( జూలై 30, 2013) అత్యవసర అసెంబ్లీని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఏపీకి చెందిన మంత్రులతో సహా, కిరణ్కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని అంతా భావించారు. ఉత్కంఠగా ఎదురు చూశారు.
కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం. అప్పటి రాజకీయ వాతావరణం పార్టీలకతీతంగా ఆంధ్ర నేతలందరినీ ఒక్కటి చేసింది. అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఎలాగైనా సమిష్టిగా ఉండి, వ్యతిరేకించాలని రెడీగా ఉన్నారు. కానీ ఆ సమయంలో కిరణ్ కుమార్రెడ్డి సైలెంట్గానే ఉన్నాడు. ఆ తరువాత ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది. కరెంటు కష్టాలు తదితర సమస్యలు ఎలా వస్తాయో.. అన్నీ వివరించారు. చిన్నపాటి ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే కేసీఆర్ .. కిరణ్కుమార్ రెడ్డిని పిట్టలదొర అని పిలిచేవాడు. కర్ర పట్టుకుని అన్నీ అబద్దాలు చెప్పాడని కేసీఆర్ మండిపడేవాడు.
అధిష్టానానికి లాయల్గా ఉన్న కిరణ్కుమార్ రెడ్డి.. అదే పంథాలో అధిష్టానం సూచించినట్టుగా వ్యవహరించి ఉండాల్సింది. అలా చేసి పార్టీలో సైలెంట్గా ఉండి ఉంటే.. ఇప్పటికైనా ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యత దక్కేది. కానీ ఆ సమయంలో రాజకీయంగా తెలంగాణకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. కానీ ఆ తీసుకునే నిర్ణయమేదో సరైన సమయానికి తీసుకోకపోవడంతో కిరణ్కుమార్ రెడ్డిని రాజకీయాలకు దూరం చేసినట్టయ్యింది. కిరణ్కుమార్రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిర్ణయానికి తగినట్టుగానే ఆ పార్టీకి జోడు చెప్పుల గుర్తు వచ్చింది. ఆ తరువాత అది కొట్టుకపోయింది. ఆంధ్రలో కాంగ్రెస్ కానరాకుండా పోయింది. కిరణ్కుమార్ రెడ్డి కూడా కనిపించకుండా పోయాడు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరినా పెద్దగా ఉనికిలో లేడు.
పాలనలో పర్వాలేదనిపించిన కిరణ్కుమార్ రెడ్డి.. తన హయాంలో పెద్దగా అవినీతి మరకలంటించుకోలేదు. ఉన్నంతలో నిజాయితీగానే వ్యవహరించాడు. ఎంఐఎంతో మాత్రం పేచీ పెట్టుకున్నాడు. తగ్గేదేలే అన్నట్టుగా ఓవైసీ బ్రదర్స్ను ముచ్చెమటలు పట్టించాడని చెబుతారు. ఏ సర్కార్ ఉన్నా.. హైదరాబాద్లో ఆ బ్రదర్స్ నిర్ణయాలకు తిరుగులేదు. సీఎంలు తలవంచక తప్పదు. ఇదే మాట వారు కూడా చెప్పుకునేది. కానీ, కిరణ్ కుమార్రెడ్డి టైమ్లో తీవ్రంగా వారిని వేధించాడు కిరణ్. దీంతో చాలా మంది హిందూవాదులకు, బీజేపీ నేతలకు కిరణ్ రెడ్డి పాలన టైమ్ అంటే ఇష్టం. ఇప్పటికీ వారు ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.
సీల్డ్ కవర్ సీఎం అని ప్రతిపక్షాలు విమర్శించే కిరణ్ కుమార్ రెడ్డి.. తనకు అంది వచ్చిన మహదవకాశాన్ని జార విడుచుకున్నాడు. టెన్ జన్ పత్ పెద్దలతో ఉన్న సత్సంబంధాలను కంటిన్యూ చేసే క్రమంలో ఫెయిలయ్యాడు. వారితో అప్పటి వరకు ఉన్న బంధాలను తెంచుకున్నాడు స్వయంగా. పోనీ కులం చెడ్డా సుఖం దక్కాలంటారు..అదైనా జరిగిందా అంటే అదీ లేదు. చేసిన త్యాగానికి గుర్తింపు లేదు.
తెలంగాణ వాదుల వద్ద ఆయన ఓ చరిత్ర హీనుడు. తెలంగాణ విలన్. అంతే. ఏపీ రాజకీయాల్లో మాత్రం హీరో కాదు. విలనూ కాదు. మరిచిపోయే పాత్ర. అందుకే మరిచిపోయారు. ఆయనా రాజకీయంగా ఎదిగే ప్రయత్నమూ చేయలేదు.
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం.. ఏమి చేసుకుంటారో చేసుకోండని.. అసెంబ్లీ సాక్షిగా తన అహంకారాన్ని ప్రదర్శించి రాజకీయంగా తనకు పరిణతి లేదని నిరూపించుకున్నాడు. మా తెలంగాణకు విలన్ అని తెలంగాణ వాదులు ఆయన తీరు పట్ల తిట్టుకున్న రోజులున్నాయి.