Nizam Collage: నిజాం కాలేజ్ హాస్టల్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. కొత్త హాస్టల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గర్ల్స్ హాస్టల్ లో యూజీ స్టూడెంట్స్ కు 50శాతం వసతి కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా విద్యార్థినులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. హాస్టల్ ను 100శాతం తమకే కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో హాస్టల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది కాలేజీ యాజమాన్యం.
నిజాం కళాశాలలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్లో వసతి కల్పించాలంటూ యూజీ విద్యార్థినులు కొన్నాళ్లుగా నిరసన చేస్తుండంపై స్పందించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల్లోగా కొత్త హాస్టల్ బిల్డింగ్ కట్టిస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్డర్ కాపీని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 200 మంది విద్యార్థినులకు సరిపడేలా హాస్టల్ బిల్డింగ్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ అనుమతి ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన నిధులను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరిట రిలీజ్ చేసినట్లు ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ఆరు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించాలని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నిర్ణయించారు. అయితే స్టూడెంట్స్తో చర్చల అనంతరం యూజీ విద్యార్థినులకు 50శాతం, పీజీ స్టూడెంట్స్ కు 50శాతం వసతి కల్పించాలని ఆదేశిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ మేరకు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని నిజాం కాలేజ్ విద్యార్థినులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హాస్టల్ను పూర్తిగా యూజీ స్టూడెంట్స్కు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు హాస్టల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఓ వైపు ఆందోళన చేస్తుండగానే… కాలేజీ మేనేజ్మెంట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజాం కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా… ఉస్మానియా యూనివర్సిటీ నుండి తమకు అందిన ఉత్తర్వుల ప్రకారం 50% యూజీ విద్యార్థినిలకు 50 శాతం పీజీ విద్యార్థినిలకు నిబంధనల మేరకు సీట్లను కేటాయిస్తామని చెప్పారు. హాస్టల్ అవసరమున్న విద్యార్థులు ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని 19వ తేదీ ఫైనల్ లిస్టును విడుదల చేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.
కాలేజీ యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయంపై విద్యార్థులు మండిపడుతున్నారు. తాజా ఉత్తర్వుల కాపీలను చించేసి నిరసన తెలిపారు. తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు.