Telangana Electricity: తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అరికట్టడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమస్యలను వేగంగా గుర్తించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా అడవులు, రద్దీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణను సులభతరం చేసేందుకు అత్యాధునిక ‘కవర్డ్ కండక్టర్ల’ వినియోగంపై దృష్టి సారించడమే కాకుండా, ప్రతీ స్తంభాన్ని డిజిటల్ మ్యాపింగ్ పరిధిలోకి తీసుకువచ్చింది.
గతంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే, లైన్ మెన్లు కిలోమీటర్ల మేర లైన్ వెంట నడుస్తూ ఫాల్ట్ ఎక్కడుందో వెతకాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు ఎన్పీడీసీఎల్ జియో ట్యాగింగ్ అసెట్ మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దీనివల్ల విద్యుత్ ఆస్తులన్నీ (స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు) గూగుల్ మ్యాప్స్ తరహాలో డిజిటల్ స్క్రీన్పై కనిపిస్తాయి. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఖచ్చితమైన లొకేషన్ను గుర్తించడం ఇప్పుడు సులువు కానుంది. అడవులు, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేందుకు కవర్డ్ కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి సాధారణ తీగల కంటే సురక్షితమైనవి, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా అటు సిబ్బందిపై పనిభారం తగ్గడమే కాకుండా, ఇటు వినియోగదారులకు అంతరాయం లేని కరెంటు అందుతుందని ఎన్పీడీసీఎల్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ustaad Bhagat Singh Third Single: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మూడో సాంగ్ లోడింగ్.. వచ్చేది ఎప్పుడంటే?
మెటీరియల్ త్వరగా విడుదల చేయడానికి, మెటీరియల్లను త్వరగా డ్రా చేసుకోవడానికి ఎన్పీడీసీఎల్ ఆన్ లైన్ వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తోంది. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ఇప్పటికే వాట్సప్ చాట్ బాట్ ను ప్రవేశ పెట్టింది. వినియోగదారులు 7901628348 నంబర్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే ఆస్కారముంది. ఇదిలా ఉండగా పొడవుగా ఉన్న లైన్లలో సాంకేతికంగా , ప్రకృతి వైపరీత్యాల వలన అంతరాయం ఏర్పడితే , ఆ సమస్యను గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీనిని నివారించడానికి పొడవుగా లైన్లు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కవర్డ్ కండక్టర్ ను ఎన్పీడీసీఎల్ అధికారులు ఫిక్స్ చేస్తున్నారు.
జియో ట్యాగింగ్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ లో అన్ని 33 కేవీల్లో 688 ఫీడర్లు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా 11 కేవీల్లో 5,743 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్లను కేటాయించారు. దీని ద్వారా పోళ్ల వారీగా పెట్రోలింగ్ సులభతరం కానుంది. నిర్వహణ ను కూడా ట్రాక్ చేసే వీలుంది. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ పోల్ నెంబర్ ద్వారా అక్కడి లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించవచ్చు. ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందగలుగుతారు. తద్వారా వేగవంతంగా చర్యలు చేపట్టే ఆస్కారముంది. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గించేందుకు ఆస్కారముంది.
Also Read: Manchu Lakshmi: పుష్ప సినిమాలో నా డైలాగ్ చూసి ఆశ్చర్యపోయా.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్!