Betting Apps: మనుషుల్లోని ఆశను పెట్టుబడిగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతుండటంతోపాటు ఎంతోమంది మరణాలకు కారణమైన బెట్టింగ్ యాప్ లపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ పేరుకే పరిమితమై పోయింది. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులు ఎవరన్నది కూడా సిట్ తెలుసుకోలేక పోయింది. దాంతో రాష్ట్రంలో నిషేధం అమల్లో ఉన్న ఆయా యాప్ ల నిర్వాహకులు ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నారు. జంగ్లీ, రమ్మీ డాట్ కామ్, ఏ23, పెయిర్ ప్లే, జీత్ విన్, వీఎల్ బుక్, తాజ్ 77, తెలుగు 365 రకరకాల పేర్లతో ఆన్ లైన్ లో నడుస్తున్న బెట్టింగ్ యాప్ లలో కష్టార్జితంతోపాటు బంధుమిత్రుల నుంచి లక్షల రూపాయలు అప్పు చేసి పందాలు కాసి ఎంతోమంది పూర్తిగా డబ్బు పోగొట్టుకున్న విషయం తెలిసింది.
ఈ క్రమంలో ఆర్థిక సమస్యల్ల కూరుకుపోయి చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలా బెట్టింగ్ యాప్ లకు బలైపోయిన వారిలో పోలీసులు కూడా ఉండటం. వీటిపై మొదట పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా మరో వ్యక్తి మియాపూర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. వీటిపై ఆయా స్టేషన్ల అధికారులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటీనటులు దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్లతోపాటు టీవీ యాంకర్లు శ్రీముఖి, శ్యామల, బుల్లితెరకు చెందిన విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ, ఇన్ ఫ్లూయెన్సర్లు సన్నీ యాదవ్, సుధీర్ తదితరులపై బీఎన్ఎస్ 318(4), 3, 3(ఏ), ఐటీ యాక్ట్ సెక్షన్ 66డీ తదితర సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. కాగా, బెట్టింగ్ యాప్ ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఉన్నదంతా పోగొట్టుకోవటం, కొందరు ఆత్మహత్యలు చేసుకోవటంతో సమగ్ర దర్యాప్తు కోసం వీటిపై విచారణకు సీఐడీలో ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేశారు.
Also Read: Tollywood: సినీ ప్రేమికులకు శుభవార్త.. థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు ఉత్తర్వులు!
ఈ క్రమంలో సిట్ అధికారులు కేసుల్లో నిందితులుగా ఉన్న సెలబ్రెటీలకు నోటీసులు ఇచ్చి పిలిపించుకుని విచారణ జరిపారు. అదే సమయంలో ఇదే అంశంపై కేసులు నమోదు చేసిన ఈడీ అధికారులు కూడా సెలబ్రెటీల నుంచి స్టేట్ మెంట్లు తీసుకున్నారు. అయితే, నెలలు గడిచిపోతున్నా దర్యాప్తు ఇక్కడికే పరిమితమై పోయింది. తప్పితే అసలు ఈ యాప్ లను నిర్వహిస్తున్నది ఎవరు? ఎక్కడి నుంచి నడుపుతున్నారు? అన్నది మాత్రం తెలుసుకోలేక పోయారు. దీనిపై అధికారులతో మాట్లాడగా చాలావరకు బెట్టింగ్ యాప్ లు విదేశాల నుంచి నడుస్తున్నట్టు తెలిసింది. వాటిని నడిపిస్తున్న వారిపై కేసులు పెట్టినా నోటీసులు జారీ చేసే పరిస్థితి లేదన్నారు. ఇక, ఏదైనా యాప్ ను నిషేధించినా ఆ వెంటనే మరో పేరుతో ఇంకో యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు. ఇక, ఆన్ లైన్ లో గేమింగ్ యాప్ ల ద్వారా కూడా బెట్టింగ్ జరుగుతోందన్నారు. ఆటల్లో నైపుణ్యానికి సంబంధించిన యాప్ లంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో నిషేధం ఉన్న నేపథ్యంలో లొకేషన్ ను పక్క రాష్ట్రాల్లో చూపిస్తున్నారని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు సూత్రధారులను పట్టుకోవటం దాదాపు అసాధ్యమని తేల్చేశారు.
Also Read: TG Education Reform: విద్యాశాఖలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక.. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి..!