TG Education Reform: రాష్ట్రంలోని విద్యా సంస్థల రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖలో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జూన్ 12 వరకు ఈ కార్యాచరణను అమలుచేసి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా తెలిపారు.
ఈ కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్త స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యా సంస్థల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు సర్కార్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. కాగా విద్యాశాఖలోని వివిధ విభాగాలకు జిల్లాస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కు జిల్లా విద్యాధికారి(డీఈవో) నోడల్ ఆఫీసర్ గా కొనసాగుతారు. ఇంటర్మీడియట్ విద్యకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో), సాంకేతిక/ఉన్నత విద్యకు రీజినల్ జాయింట్ డైరెక్టర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. ఇదిలా ఉండగా విశ్వవిద్యాలయాలకు సంబంధిత రిజిస్ట్రార్లు కొనసాగుతారని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: Collectors Competition: తెలంగాణలో ఫస్ట్ ప్రైస్ కొట్టేందుకు కలెక్టర్లకు యమ కాంపిటేషన్..?
‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రధానంగా మౌలిక సదుపాయాలపై సర్కార్ దృష్టిసారించనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ముఖ్యంగా భవనాల మరమ్మతులు, ల్యాబ్లు, లైబ్రరీల బలోపేతం, హాస్టల్ నిర్వహణపై ఫోకస్ పెట్టనుంది. ఈనెల 15 వరకు క్యాంపస్ క్లీన్ లైన్స్ డ్రైవ్, శానిటేషన్ కార్యరక్రమాలు, ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్ పై దృష్టిసారించనున్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఇంటర్ పరీక్షల మూల్యాంకనం, విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేలా నిర్ణయించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదును పెంచేందుకు ఏప్రిల్, మే నెలల్లో ఇంటింటికీ ప్రచారం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగించనున్నారు. విద్యాసంస్థలు డిజిటల్ విప్లవం దిశగా దూసుకువెళ్లేందుకు ఈ-ఆఫీస్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) టూల్స్పై సిబ్బందికి శిక్షణ, డిజిటల్ రికార్డుల అప్డేట్ పై ఫోకస్ పెట్టనున్నారు. అంతేకాకుండా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక మార్పు, ఇంటర్న్షిప్లు, జాబ్ మేళాలు నిర్వహించాలని ఈ ప్రణాళికలో పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా మే 11 నుంచి 17 వరకు ‘ఎడ్యుకేషన్ వీక్’(విద్యా వారోత్సవాలు) నిర్వహించనున్నారు. అలాగే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు, జూన్ మొదటి వారంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల పున:ప్రారంభం వంటి కీలక ఘట్టాలు ఈ 99 రోజుల ప్రణాళికలో ఉన్నాయి. ఈ కార్యక్రమం అత్యవసరమైనదని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్లు జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్లతో వెంటనే రివ్యూ నిర్వహించి వెంటనే అమలుకు శ్రీకారం చుట్టాలని సర్కార్ ఆదేశించింది.
Also Read: Anil – Venky: వెంకటేష్ కొత్త మూవీలో నేషనల్ విన్నింగ్ హీరోయిన్.. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ?