Kondagattu Temple: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు.. కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు టీటీడీ బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.35.19 కోట్ల వ్యయంతో 2,000 మందికి సరిపడే దీక్ష విరమణ మండపం, 96 గదులతో కూడిన సత్రం నిర్మించనున్నారు.
తెలంగాణలోని ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల్లో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సరిపడా వసతి సదుపాయాలు లేకపోవడం ఎన్నో ఏళ్లుగా ప్రధాన సమస్యగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇటీవల అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనుల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. పవన్ కళ్యాణ్ కొండగట్టు గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. గత ఏడాది వారాహి యాత్ర సమయంలోనూ, ఇటీవల ఎన్నికల తర్వాత వారాహి దీక్షలో భాగంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు, భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించాలని అర్చకులు కోరగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడులతో చర్చించి ఈ నిధులను విడుదల చేయించారు.
ప్రతిపాదిత దీక్ష విరమణ మండపం ఒకేసారి 2,000 మందికి ఉపయోగపడేలా నిర్మించనున్నారు. విశాలమైన ప్రాంగణం, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, శౌచాలయాలు వంటి అన్ని మౌలిక వసతులతో ఈ మండపాన్ని ఆధునికంగా రూపొందించనున్నారు. దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ప్రశాంతంగా తమ ఆచారాలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
అదేవిధంగా, భక్తుల నివాస అవసరాల కోసం 96 గదులతో కూడిన సత్రం కూడా నిర్మించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లోనే బస చేసేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. సత్రంలో భక్తులకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
Also Read: వాహ్ పవన్ కళ్యాణ్.. ఇది కదా రాజకీయ హుందాతనం
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కొండగట్టు ఆలయ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనంతో పాటు నివాసం కూడా లభించనుంది. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అభిప్రాయపడుతున్నారు.