Narendra Modi: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, గౌరవ వందనం వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ఈ స్వాగతం మరింత ఆకర్షణీయంగా మారింది.
అయితే, ఆ సమయంలోనే ఒక చిన్న విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అధికారిక సమావేశాల సమయంలో మోదీ చెవిలో కనిపించిన రింగ్ లాంటి పరికరం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ చూడని ఈ డివైజ్ ఏంటనే.. ఆసక్తితో చాలామంది దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే మోదీ ధరించిన ఇయరింగ్ ఫ్యాషన్ కోసం కాదు.. అది పూర్తిగా ఆధునిక సాంకేతిక అవసరానికి సంబంధించినదే అని తర్వాత స్పష్టమైంది.
అసలు ఆ పరికరం ఒక రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఇయర్పీస్. అంటే.. ఎదుటి వ్యక్తి ఏ భాషలో మాట్లాడినా, ఆ మాటలను వెంటనే అనువదించి వినిపించే స్మార్ట్ డివైజ్ ఇది. ఒమన్లో అధికార భాష అరబిక్ కావడంతో.. అక్కడి నేతలు, అధికారులు, దౌత్యవేత్తలతో జరిగే చర్చలను క్షణాల్లో అర్థం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఈ పరికరాన్ని ఉపయోగించారు.
ప్రధాని మోదీ-ఒమన్ ఉప ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్తో జరిగిన భేటీలో ఈ ట్రాన్స్లేషన్ డివైజ్ స్పష్టంగా కనిపించింది. దౌత్యపరమైన చర్చల్లో మాటలు మిస్ కాకుండా, తక్షణమే అర్థమయ్యేలా చేయడంలో ఈ తరహా టెక్నాలజీ ఎంతో కీలకంగా మారుతోంది.
ఈ పర్యటన కేవలం టెక్నాలజీ కారణంగానే కాదు.. భారత్-ఒమన్ సంబంధాల పరంగా కూడా చాలా కీలకమైనది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో సుమారు 98% భారతీయ ఉత్పత్తులు ఒమన్లో సుంకాలు లేకుండా దిగుమతి అయ్యే అవకాశం ఏర్పడింది.
ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రదానం చేశారు. ఇది ప్రధాని మోదీకి లభించిన 29వ అంతర్జాతీయ గౌరవంగా నిలిచింది.