
Jagtial korutla sisters incident news(Telangana news today):
సోఫాలో దీప్తి డెడ్బాడీ. ఇంట్లో ఉండాల్సిన చెల్లి చందన మిస్సింగ్. చెల్లే అక్కను చంపి పారిపోయిందా? అనే అనుమానం. పోలీసుల సెర్చింగ్లో ఓ క్లూ చిక్కింది. బాయ్ఫ్రెండ్తో కలిసి బస్సు ఎక్కి చందన వెళ్లిపోయిందని సీసీఫూటేజ్లో తెలిసింది. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అక్క చావుకు కారణం తెలీలేదు. ఇలాంటి సమయంలో.. తమ్ముడికి ఫోన్ చేసింది చందన. ఆ ఫోన్ కాల్తో మరో విషయం బయటపడింది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో దీప్తి అనుమానాస్పద మృతి కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అక్కను తాను చంపలేదని తమ్ముడితో ఫోన్లో చెప్పింది చందన. ఇంట్లో అమ్మానాన్నలు లేకపోవడంతో.. అక్క మద్యం తాగుదామని అనిందని చెబుతోంది. తాను ఫ్రెండ్తో రెండు బాటిళ్లు తెప్పించానని చందన అంటోంది.
మద్యం మత్తులో అక్క బాయ్ఫ్రెండ్ను పిలుద్దామని చెప్పిందని.. తాను అందుకు ఒప్పుకోలేదని తమ్ముడితో చెప్పింది. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యేలోగా.. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసిందని అంటోంది. తాను వెళ్లేముందు అక్క సోఫాలో పడుకుని ఉందని.. రెండుసార్లు లేపడానికి ప్రయత్నించినా లేవలేదని చందన చెబుతోంది. ఆమెను డిస్ట్రబ్ చేయకుండా తాను వెళ్లిపోయానని.. అక్కను చంపాల్సిన అవసరం తనకేంటని తమ్ముడితో చందన ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్ అయింది.
అసలేం జరిగిందంటే…
జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దీప్తి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఆమె మరణం మిస్టరీగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్దమ్మాయి దీప్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నారు. రెండో అమ్మాయి చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చేస్తున్నాడు.
బంధువుల గృహప్రవేశం కార్యక్రమం కోసం శ్రీనివాస్రెడ్డి, మాధవి హైదరాబాద్కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు కుమార్తెలతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం దీప్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో కంగారు పడి తల్లిదండ్రులు పక్కింటి వారికి విషయం చెప్పారు. వారు ఆ ఇంటికి వచ్చి దీప్తి మృతి చెంది ఉండటంతో షాక్ అయ్యారు. రెండో కుమార్తె చందన ఇంట్లో లేదని గుర్తించారు.
ఈ సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. దీప్తి సోఫాలో అనుమానాస్పదంగా మృతిచెంది ఉంది. కిచెన్లో 2 మద్యం సీసాలు, కూల్డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లను గుర్తించారు.
చందన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బస్టాండ్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చందన, మరో యువకుడితో కలిసి ఉదయం 5.12 – 5.16 గంటల మధ్య నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చున్నారని గుర్తించారు. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా తేలింది. చందనతో పాటు ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెల్లి చందన ఆచూకీ తెలిస్తేనే దీప్తి మృతి మిస్టరీ వీడుతుంది. ఆలోగా చందన.. తన తమ్ముడికి ఫోన్ చేసి అక్క హాఫ్ బాటిల్ తాగిందని.. బాయ్ఫ్రెండ్ను పిలుద్దామందని చెప్పడం.. ఆ ఫోన్ ఆడియో వైరల్ కావడంతో కేసు మరో టర్న్ తీసుకుంది.
మద్యం మోతాడు ఎక్కువై దీప్తి మరణించిందా? చందన వెళ్లిపోయాక దీప్తి ఇంటికి బాయ్ఫ్రెండ్ వచ్చాడా? అక్కడ ఇంకేమైనా జరిగిందా? ఇలా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ ఏ మతం? తిరుమలపై కుట్ర.. బండి సంజయ్ సంచలనం