Phone Tapping Case Updates: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్లో గుబులు రేపుతోందా? ఎందుకు ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు? ఆధారాలు దగ్గర పెట్టి మరీ కేటీఆర్ను విచారిస్తున్నారా? సడన్గా మాజీ డీసీపీ రాధాకిషన్రావుని ఎందుకు రప్పించారు? ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ పీఎస్లో కేటీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తొలుత కేటీఆర్ స్టేషన్ లోపలికి వెళ్లగానే కాసేపు కూర్చోబెట్టారు. చేతిలో కొన్ని పేపర్స్ కేటీఆర్ తీసుకెళ్లారు. పావు గంట తర్వాత విచారణ చేస్తున్న గది వద్దకు ఆయన్ని తీసుకెళ్లారు అధికారులు.
జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరిలతోపాటు ఐదుగురు అధికారులు కలిసి విచారణ చేస్తున్నారు. రెడీ చేసిన ప్రత్యేక ప్రశ్నలను దగ్గరపెట్టి ఆయన్ని విచారిస్తున్నారు. 2023 ఏడాదిలో బీఆర్ఎస్కి భారీగా విరాళాలు ఎలా వచ్చాయి? వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న ఎలక్టోరల్ బాండ్స్ వెనుక ఏం జరిగింది? వ్యాపారవేత్తలు ఎందుకు మీపై ఫిర్యాదు చేశారు?
కేటీఆర్- రాధా కిషన్రావులను దగ్గర పెట్టి విచారణ
ఈ వ్యవహారం గురించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకేం తెలుసు? ఎన్నికలకు ముందు దాదాపు వేలాది ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ప్రైవేటు ఛానెల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్కి డబ్బులు ఎందుకొచ్చాయి? రాజకీయం-ఆర్థికంగా లబ్ది కోసమే ఫోన్ ట్యాప్ చేశారా? గతంలో రాధాకిషన్రావు చెప్పిన రికార్డులు, ఛాటింగులకు సంబంధించిన డేటాను దగ్గర పెట్టి విచారణ చేస్తున్నారట అధికారులు.
కొన్ని ప్రశ్నలకు అధికారులు చూసుకున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారట కేటీఆర్. 2023 ఎన్నికల కంటే ముందు చాలా కేసులు సంబంధించిన డైరెక్షన్ కేటీఆర్ నుంచి వచ్చినట్టు సిట్ అధికారుల వద్ద సమాచారం ఉంది. మునుగోడు ఎన్నికల సమయంలో రైడ్స్ చేసి కొన్ని కోట్లు స్వాధీనం చేసుకుంది టాస్క్ఫోర్స్. దానిపై కూడా ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. మూడు విడతలుగా ఇరువుర్ని విచారించాలని భావిస్తున్నారట అధికారులు.
ALSO READ: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి