Phone tapping case Update(Telangana news today): తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లినకొద్దీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. విచారణలో మాజీ అధికారులు కొత్త కొత్త విషయాలు బయటపెట్టినట్టు సమాచారం.
మాజీ డీసీపీ రాధాకిషన్రావు టీమ్.. పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థులను కట్టిడి చేయడంతో కీలకపాత్ర పోషించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముందుగా నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లను రెడీ చేసి ఎస్ఐబీ ఆఫీసులో ప్రణీత్రావుకు ఇచ్చేవారు. వారి కదలికలను టెక్నాలజీ సాయంతో గమనించి సేకరించిన సమాచారాన్ని రాధాకిషన్రావుకు చేర వేసేశారని అంటున్నారు. దీని ఆధారంగా ఆయన టీమ్ ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థులను కట్టడి చేయడంపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే భుజంగరావు సైతం ఇదే విధంగా ఓ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నాలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తూ ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లను ప్రతీణ్రావుకు అందించినట్టు తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టాస్క్ఫోర్స్ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్రావు.. సిబ్బందిని అనధికార కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారట. కేసుల దర్యాప్తుకు పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని తెలుస్తోంది.
నవంబర్ శాసనసభ ఎన్నికల సమయంలో ఈ ఆగడాలు పతాకస్థాయికి చేరినట్టు సమాచారం. పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన టీమ్ను రంగంలోకి దింపారు. ఏకంగా టాస్క్ఫోర్స్ వాహనాల్లోనే నగదు తరలింపు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదన్న ఆలోచనతో అమలు చేశారట.
రాధాకిషన్రావును సుధీర్ఘంగా విచారించిన అధికారులు కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయింది, వెంటనే ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు రాధాకిషన్రావును తమ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు పోలీసు అధికారులు.
ALSO READ:కేటీఆర్ చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను తొలిరోజు కస్టడీకి తీసుకున్న అధికారులు వీరిని పెద్దగా విచారించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకిషన్రావు నుంచి తీసుకున్న సమాచారంతో వీళ్ల ముందు పెట్టి విచారించాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. ఈ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.