CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. బెంగళూరులో ‘ద హిందూ గ్రూప్’ నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ .రామ్ తో తన రాజకీయ నేపథ్యాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా విద్యార్థి పరిషత్ లో పనిచేశానన్న రేవంత్.. 2006లో ఇండిపెండెంట్ గా జడ్పీటీసీ గెలిచినట్లు తెలిపారు. తర్వాత టీడీపీలో చేరి పదేళ్లుగా చంద్రబాబుతో ఉన్నట్లు చెప్పారు. తర్వాత టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరానని గుర్తుచేశారు. తొలుత కాంగ్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి పోలీసు పటేల్ అన్న రేవంత్.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజల ఆశీర్వాదంతో సీఎం స్థాయికి వచ్చానని భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.
గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారు.. పాలకులుగా వచ్చారని కానీ తాను మాత్రం సేవకుడిగా, సామాన్యుల ప్రతినిధిగా తనను తాను భావించానని రేవంత్ అన్నారు. పాదయాత్రలో నిరుద్యోగుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానని.. తాము అధికారంలోకి వచ్చిన తొలి 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ రాష్ట్రంలోని యువత ప్రస్తుతం ఉద్యోగాలకు సిద్దమవుతున్నట్లు ద హిందూ కార్యక్రమంలో రేవంత్ పేర్కొన్నారు.
మరోవైపు తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 25,035 రైతు కుటుంబాలకు చెందిన రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేశామని పేర్కొన్నారు. 2024-25 సంవత్సరంలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక సైతం కొనియాడిందని గుర్తుచేశారు. మరోవైపు మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు రేవంత్ అన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని 67 లక్షలు మంది మహిళలకు.. 0 వడ్డీతో రూ.60 వేల కోట్ల రుణాలు అందించినట్లు చెప్పారు. ఆ వడ్డీలను తాము కడుతున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలు 1000 బస్సులు కొనుగోలు చేశాయని రేవంత్ తెలిపారు.
Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా చేస్తారన్న ప్రశ్నకు రేవంత్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ లోని 160 కి.మీ ఔటర్ రింగు రోడ్డు ప్రాంతాన్ని క్యూర్, ప్యూర్, రేర్ గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్యూర్లో సర్వీస్, ప్యూర్ లో మ్యానుఫ్యాక్చర్, రేర్లో అగ్రికల్చర్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పాటు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి మచిలీ పట్నం ఓడరేవును హైదరాబాద్ కు అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రోడ్డు, రైలు, ఓడరేవు, విమానాశ్రయంతో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.. అవే తమ వృద్ధికి కారణాలవుతాయని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఫ్రిడ్జ్లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!